- 243 కోట్ల టర్నోవర్...వెంటనే 25 కోట్లకు పడిపోయిన టర్నోవర్ !
- వరుస నష్టాలు చూపిస్తూ ఐటీ ఎగవేత.
- వింధ్యా బులియన్ అనుమానాస్పద లావాదేవీలు.
- అడ్వాన్స్ల రూపంలో షెల్ కంపెనీల్లోకి చేరవేత.
- ఆదాయపన్ను శాఖ ఆకస్మిక తనీఖీలకు ఫిర్యాదులు !
హైదరాబాద్: కేవలం రూ.1,00,000 ప్రారంభ పెట్టుబడితో ప్రారంభమైన ఒక సాధారణ ప్రైవేట్ కంపెనీ, కేవలం రెండేళ్లలోనే ఏకంగా రూ.2,43,26,55,667 (రూ.243.26 కోట్లు) వ్యాపార టర్నోవర్ను సాధిస్తే అది అద్భుతమైన వ్యాపార వృద్ధి అనుకుంటే పొరపాటే ! ఈ కళ్ళు చెదిరే సంఖ్యల వెనుక ఒక పక్కా వ్యూహంతో కూడిన ఆదాయపు పన్ను ఎగవేత నెట్వర్క్ దాగి ఉందనే బలమైన అనుమానాలు కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ మరియు ఆదాయపు పన్ను శాఖ రికార్డుల ద్వారా వ్యక్తమవుతున్నాయి. నగరం నడిబొడ్డున ఉన్న ‘వింధ్యా బులియన్ ప్రైవేట్ లిమిటెడ’ (Viindhya Bullion Private Limited - CIN: U51398TG2021PTC151354 ) కంపెనీకి సంబంధించిన అధికారిక పత్రాలను లోతుగా పరిశీలించినప్పుడు, పన్ను ఎగవేత కోసం మరియు నల్లధనాన్ని చట్టబద్ధం చేయడం కోసం అనుసరించిన పలు వివాదాస్పద ఆర్థిక లావాదేవీలు వెలుగులోకి వచ్చాయి. ఆ వివరాలపై ఒక ప్రత్యేక ఇన్వెస్టిగేటివ్ రిపోర్ట్ మీ కోసం.
లాభాలు లేవు.. పన్ను కట్టం: రూ.243 కోట్ల టర్నోవర్ కానీ చూస్తే నష్టాలు!
ఈ కంపెనీ మొదటి ఆర్థికసంవత్సరం (2021-22) లో రూ.7.75 కోట్ల టర్నోవర్ సాధించి రూ.8.12 లక్షల నష్టాన్ని చూపించింది. అయితే, మరుసటి సంవత్సరం (2022-23) నాటికి ఈ రాబడి ఏకంగా 3,000 శాతం పెరిగి రూ. 243.26 కోట్లకు చేరింది. ఇంత భారీగా వ్యాపారం జరిగినప్పటికీ, కంపెనీ లాభాలు గడించడానికి బదులుగా ఏకంగా రూ. 82.58 లక్షల నికర నష్టాన్ని రికార్డుల్లో చూపించింది. తరువాత సంవత్సరానికి (2023-24) నాటికిì రూ. 25.89 కోట్లకు పడిపోయింది, అదే సమయంలో కంపెనీ రూ. 3.10 కోట్ల నికర నష్టాన్ని ప్రకటించింది. 2024`25 ఆర్థిక సంవత్సరం వచ్చే సరికి 2.74 కోట్లకు మాత్రమే పరిమితం అయ్యింది, కానీ కంపెనీ రూ. 5.63 కోట్ల నికర నష్టాన్ని ప్రకటించింది. బులియన్ మరియు జ్యూవెలరీ రంగంలో ఇలాంటి భారీ టర్నోవర్ పతనం సాధారణం కాదని ఆర్థిక నిపుణులు అభిప్రాయ పడుతున్నారు. అదే సమయంలో బంగారం, డైమండ్స్ వంటి అత్యంత విలువైన వ్యాపారంలో అమ్మకాల కంటే కొనుగోలు వ్యయాన్ని (రూ.244.92 కోట్లు) ఎక్కువగా చూపిస్తూ, పన్ను పరిధిలోకి రాకుండా లాభాలను ఉద్దేశపూర్వకంగా పక్కదారి పట్టించారనే అనుమానాలకు ఈ లెక్కలు బలాన్ని చేకూరుస్తున్నాయి.
అడ్వాన్స్ల రూపంలో షెల్ కంపెనీలకు తరలింపు ?
వింధ్య ఆరమ్ గోల్డ్ ట్రేడింగ్ ఎలఎల్సి అనే విదేశీ అనుబంధ సంస్థకు సంబంధించిన వివరాలు కనిపించాయి. కానీ విదేశీ మారక ద్రవ్య లావాదేవీల విభాగంలో నిల్గా చూపినట్లు తెలుస్తోంది. అదే సమయంలో సంబంధిత సంస్థలు (వింధ్య జూవెల్స్ ప్రై.లి., వింధ్య ఆరమ్ గోల్డ్ ట్రేడింగ్ ఎలఎల్సి, సేవ్ గోల్డ్, వింధ్య బులియన్) మరియు డైరెక్టర్లతో లావాదేవీలు ఉన్నట్లు వివరాలు కనిపిస్తుండగా, మరో వైపు సెక్షన్ 188 (1) పరిధిలో ఎలాంటి రిలేటెడ్ పార్టీ ట్రాన్స్క్షన్స్ లేవు అని సంస్థ ప్రకటించింది. ఈ కంపెనీలు అన్నీ వింధ్య బులియన్ ప్రై.లి. సంస్థకు షెల్ కంపెనీలుగా వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది. ఇవే కాకుండా వింధ్య జూవెల్స్ ప్రై.లి., వింధ్య ఆరమ్ గోల్డ్ ట్రేడింగ్ ఎలఎల్సి, వింధ్య స్డూడియోస్, వింధ్య ఇన్ఫినైట్ ప్రాజెక్ట్స్, వింధ్య కమోడిటీస్ ఎల్.ఎల్.పి. విబల్య నాచురల్స్ ప్రై.లి. వంటి షెల్ కంపెనీలు ఈ డెరెక్టర్లే నడిపిస్తుండటం గమనార్హం.
‘కస్టమర్ అడ్వాన్స’ ముసుగులో కోట్ల రూపాయల నిధులు
కంపెనీ బ్యాలెన్స్ షీట్ను పరిశీలిస్తే, రూ. 2,47,51,000 (రూ.2.47 కోట్లు) నిధులను కస్టమర్ల నుండి వచ్చిన అడ్వాన్స్లుగా చూపించారు. సాధారణంగా నిబంధనల ప్రకారం ఏడాది కంటే ఎక్కువ కాలం ఇలాంటి నిధులను అడ్వాన్స్లుగా ఉంచితే అవి డిపాజిట్లుగా మారి చట్టపరమైన నిఘా పరిధిలోకి వస్తాయి. దీని నుండి తప్పించుకోవడానికి కంపెనీ యాజమాన్యం Form DPT-3 ద్వారా మినహాయింపుల కోసం దరఖాస్తు చేస్తూ 2026 మార్చి వరకు ఈ నిధులను హోల్డ్లో ఉంచింది. ఆదాయపు పన్ను చట్టం సెక్షన్ 68 (Unexplained Cash Credits) ప్రకారం, ఈ రూ.2.47 కోట్ల నిధులు ఎక్కడి నుండి వచ్చాయి, ఆ కస్టమర్ల ఆర్థిక సామర్థ్యం ఏమిటనే దానికి సరైన ఆధారాలు చూపకపోతే, దీనిని అక్రమ ఆదాయంగా పరిగణించి పన్నుతో పాటు భారీ జరిమానా విధించే అవకాశం ఉంది.
అనుమానాస్పద వేతనాలు మరియు “బోగస్ ఉద్యోగుల” గుట్టు
కంపెనీ తొలి ఏడాదిలో రూ.7 కోట్లకు పైగా వ్యాపారం నిర్వహించినా, సంస్థను నడిపే మేనేజింగ్ డైరెక్టర్లకు ఒక్క రూపాయి కూడా జీతంగా ఇవ్వలేదు. కానీ మరుసటి ఏడాది డైరెక్టర్ల జీతాలను అకస్మాత్తుగా లక్షల్లోకి పెంచారు. అంతేకాకుండా, సంస్థలో ఒక దశలో 50 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారని, వారికి జీతాల కింద రూ.69.32 లక్షలు చెల్లించినట్లు రికార్డులు చూపించాయి. కానీ, ఆశ్చర్యకరంగా ఆ 50 మంది ఉద్యోగుల సంక్షేమం కోసం ఖర్చు పెట్టింది కేవలం రూ.24,000 మాత్రమే. ఇది కేవలం కాగితాలపై సృష్టించిన “బోగస్ ఉద్యోగుల” నెట్వర్క్ అని, కంపెనీ ఖర్చులను ఎక్కువగా చూపించి పన్ను తగ్గించుకోవడానికే ఈ వ్యూహం పన్నారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ఆడిటర్ల ఆకస్మిక రాజీనామా.. వెనుక ఉన్న అసలు రహస్యం?
కంపెనీ స్థాపన నుండి అత్యంత కీలకమైన పాత్ర పోషించిన ఆడిటింగ్ సంస్థ ‘అనగామ్ అండ్ కో’ (Anagam & Co) అధినేత ఎ. సాయి కుమార్, 2024 సెప్టెంబర్లో తన 5 ఏళ్ల ఆడిటింగ్ పదవికి అకస్మాత్తుగా రాజీనామా చేశారు. కంపెనీ టర్నోవర్ వందల కోట్లకు చేరిన తరుణంలో, ఎలాంటి బలమైన కారణం లేకుండా “వ్యక్తిగత బిజీ” అంటూ ఆయన తప్పుకోవడం కార్పొరేట్ వర్గాల్లో సంచలనంగా మారింది. భారీ నిధుల లావాదేవీలకు సంబంధించి ఫిజికల్ స్టాక్ డెలివరీ రికార్డులు సరిగ్గా లేకపోవడం వల్లే, లీగల్ చిక్కుల నుండి తప్పించుకోవడానికి సదరు ఆడిటర్ తప్పుకున్నట్లు తెలుస్తోంది. ఆ తర్వాత కంపెనీ త్వరితగతిన M/s SDNR & Associates ను కొత్త ఆడిటర్లుగా 2029 వరకు నియమించుకుని పాత రికార్డులను సరిచేసే పనిలో పడింది.
తరచుగా ఆఫీస్ అడ్రస్ల మార్పు
ఈ బులియన్ కంపెనీ కేవలం ఐదేళ్ల వ్యవధిలో హైదరాబాద్ నగరంలో మూడు వేర్వేరు ప్రాంతాలకు తన రిజిస్టర్డ్ ఆఫీస్ను మార్చింది.
మొదట కల్యాణ్ నగర్,
తర్వాత వెంగళరావు నగర్,
చివరగా సనత్ నగర్ ఇండస్ట్రియల్ ఎస్టేట్.
సనత్ నగర్ కార్యాలయానికి సంబంధించి సమర్పించిన విద్యుత్ బిల్లు (Consumer No: BJH281) ఇప్పటికీ ల్యాండ్లార్డ్ ‘యు-ఫోమ్ ప్రైవేట్ లిమిటెడ’ పేరు మీదే ఉండటం, వీటికి ప్రత్యేక సబ్-మీటర్ రీడింగ్స్ లేకపోవడం గమనార్హం. ఐటి శాఖ సర్వేల నుండి మరియు ఫిజికల్ వెరిఫికేషన్ల నుండి తప్పించుకోవడానికే ఈ తరహా “షెల్ కంపెనీ” వ్యూహాలను అనుసరిస్తున్నట్లు స్పష్టమవుతోంది.
ఐటి విచారణకు పక్కా గ్రౌండ్!
ఈ పత్రాల ఆధారంగా వింధ్యా బులియన్ ప్రైవేట్ లిమిటెడ్ పై ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 68 (అక్రమ నగదు నిధులు), సెక్షన్ 37 (బోగస్ ఖర్చుల క్లెయిమ్) మరియు సెక్షన్ 145 (అకౌంటింగ్ విధానాల తారుమారు) కింద తక్షణమే సమగ్ర విచారణ లేదా రైడ్స్ జరపడానికి ఐటి ఇన్వెస్టిగేషన్ విభాగానికి సరిపడా పక్కా ఆధారాలు లభించినట్లయింది. ఒకవైపు కోట్ల రూపాయల వ్యాపార నిధులను గుట్టుచప్పుడు కాకుండా మళ్లిస్తూ, మరోవైపు కంపెనీల చట్టం నిబంధనల ముసుగులో ఏకంగా రూ.5.63 కోట్ల భారీ నిరంతర నష్టాలను చూపిస్తూ ప్రభుత్వ ఖజానాకు పన్నుల రూపంలో రావలసిన ఆదాయాన్ని గండికొడుతున్న ఈ వ్యవహారంపై తక్షణ చర్యలు అవసరమని ఆర్థిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు.



0 Comments