- ప్రై.లి. కంపెనీలతో ఆర్థిక అవకతవకలు !
- షేర్ల మార్పిడి పేరుతో డేంజర్ గేమ్ !
- రూ.5 షేరు రూ. 1. 86పైసలకే వేరే కంపెనీకి అమ్మకం !
- కేవలం రూ. 3 కోట్లతో రూ. 5778 కోట్లు కంపెనీ సొంత చేసుకున్న వైనం !
- కోయస్లోకి వచ్చిన నిధులు ఏమౌతున్నట్లు ?
అనగనగా ఓ ప్రైవేటు లిమిటెడ్ కంపెనీ. దాని పేరు VARSITY EDUCATION MANAGEMENT PVT LTD 2023-24 ఆర్థిక సంవత్సరానికి వర్సిటీ లాభం రూ. 1969 కోట్లు. ఇంతే కాదు వేల కోట్లు రిజర్వుల్లో డబ్బు మూలుగుతుంది. ఇంత పెద్ద కంపెనీ కేవలం మూడంటే మూడు కోట్లు కూడా లేని కోయస్ ఎడ్యుకేషన్ మేనేజ్మెంట్ ప్రై.లి. కంపెనీ తన షేర్లు మొత్తాన్ని అప్పగించేసింది. ఎలా...ఎలా..ఎలా..అని ఆర్థిక నిపుణులు సైతం తలలు పట్టుకుంటున్నారు. వివరాల్లోకి వెళితే అసలు వర్సిటీ ఎడ్యుకేషన్ మేనేజ్మెంట్కి రూ. 5 /- ముఖ విలువ గల 16502002 షేర్స్ ఉన్నాయి. వీటిలో మెజార్టీ వాటా 15864560 షేర్లు కోయస్ ఎడ్యుకేషన్ మేనేజ్మెంట్ ప్రై.లి. కేవలం 2.94 కోట్లకు కేటాయించింది వర్సిటీ ఎడ్యుకేషన్ మేనేజ్మెంట్ ప్రై.లి. కానీ అసలు షేర్ల విలువ 7.93 కోట్లు. అంటే షేరు ధర కేవలం రూ.1.86 పైసలకే ఇచ్చేసింది. వర్సిటీ ఎడ్యుకేషన్ అంత నష్టానికి ఎందుకు కేటాయించింది ? వర్సిటీకి కోయస్ ఎడ్యుకేషన్కు ఉన్న సంబంధం ఏంటి ? వర్సిటీ షేర్లు కోయస్కు మాత్రమే ఎందుకు విక్రయించింది ? బయట వ్యక్తులకు రూ. 1.86 పైసలకే షేర్లను అమ్ముతారా ? ఇలాంటి ఎన్నో చిక్కుప్రశ్నలకు సమాధానం శ్రీచైతన్య యాజమాన్యమే చెప్పాలి.
కోయస్ ఎడ్యుకేషన్ జగన్మాయ !
కోయస్ ఎడ్యుకేషన్ మేనేజ్మెంట్ ప్రై.లి. కి ఉద్యోగులు లేరు, కార్యకలాపాలు లేవు. అద్దెలు లేవు, ఇతర ఖర్చులు లేవు. ఒక కంపెనీ పేపరు మీదే ఉంటే రూల్స్ ప్రకారం దానిని షెల్ కంపెనీగా అభివర్ణిస్తారు. 2018 నుండి 2023 వరకు కేవలం నష్టాలను మాత్రమే చూపించిన కోయస్ ఎడ్యుకేషన్ 26`07`2023 న ప్రై.లి. కంపెనీగా మారింది. ఎప్పుడైతే ప్రై.లి. కంపెనీగా మారిందో అప్పటి నుండి VARSITY EDUCATION MANAGEMENT PVT LTD నుండి షేర్ల బై బ్యాక్ పేరుతో కోట్లాది రూపాయలు కోయస్ ఎడ్యుకేషన్లోకి నిధుల వరద పారుతోంది. 19`10`2022 వ తేదీన షేర్ల బైబ్యాక్ పేరుతో రూ. 5 ముఖ విలువ కలిగిన 11, 08, 976 షేర్లను ఒక్కొ షేరుకు రూ. 1893.64 రూ. ప్రీమియం చెల్లించి రూ. 210 కోట్లు కోయస్ ఎడ్యుకేషన్ మేనేజ్మెంట్లోకి తరలించింది. అదే విధంగా 30`09`2024 న మరోసారి షేర్ల బైబ్యాక్ పేరుతో రూ. 5 ముఖ విలువ కలిగిన 637428 షేర్లను ఒక్కొ షేరుకు రూ. 3916.42 రూ. ప్రీమియం చెల్లించి రూ. 249 కోట్లు కోయస్ ఎడ్యుకేషన్ మేనేజ్మెంట్లోకి మళ్ళించింది. ఈ లెక్కన కోయస్ ఎడ్యుకేషన్ మేనేజ్మెంట్ ప్రై.లి. ఈ రోజుకి షేర్ల విలువ ఎంతో తెలుసా. రూ. 5778.9 కోట్లు. అంటే ప్రతి సంవత్సరం ఇలాగే షేర్ల బై బ్యాక్ పేరుతో వందలాది కోట్లను కోయస్కు తరలించేందుకు పక్కా ప్లాన్ ముందుగానే సిద్ధం అయ్యింది అన్నమాట. అంటే వర్సిటీ ఎడ్యుకేషన్లోని సొమ్మును అత్యధిక ప్రీమియం పేరుతో కోయస్లోకి తరలించడానికి శ్రీచైతన్య యాజమాన్యం అయిన బొప్పన సుష్మశ్రీ, బొప్పన సీమ వేసిన అద్భుతమైన పథకంగా అభివర్ణించవచ్చు. కోయస్లోకి వచ్చిన నిధులు ఎవరైనా వ్యక్తిగత ఖాతాలకు మళ్ళుతున్నాయా ? లేక బినామీ పేర్లతో భూములు కొనుగోళ్ళకు తరలుతున్నాయా ? అనేది తెలియాల్సి ఉంది.
అనుబంధ సంస్థల నుండి వర్సిటీలోకి...వర్సిటీ నుండి కోయస్లోకి నిధుల మళ్ళింపు !
వర్సిటీకి అనుబంధ సంస్థలుగా శ్రీచైతన్య స్టూడెంట్ ఫెసిలిటీ మేనేజ్మెంట్ ప్రై.లి., ర్యాంక్గురు టెక్నాలజీస్ ప్రై.లి. శ్రీవిద్యా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రై.లి., అప్టౌన్ లైఫ్ ప్రాజెక్ట్ ప్రై.లి., ఇవే కాక మరెన్నో ఉమ్మడి నియంత్రణలో ఉన్న బీజేయస్ బిల్డర్స్, శ్రీవనమాలి అగ్రోఫామ్స్, శ్రీవశిష్ట ఇన్ఫ్రాస్ట్రక్చర్స్, శ్రీ విహర్ అగ్రోటెక్, శ్రీవైభవి ఇన్ఫ్రాస్ట్రక్చర్స్, శ్రీవైభవి ఇన్ఫ్రాస్ట్రక్చర్స్, శ్రీవరాహ హార్టికల్చర్ వంటి ఎన్నో సంస్థల్లోకి వర్సిటీ ఎడ్యుకేషన్ మేనేజ్మెంట్ నుండి నిధులు మళ్ళిస్తూ, ఆయా కంపెనీల షేర్లను వర్సిటీ పేరు మీద రాయించుకుంటోంది. అయితే వర్సిటీ నిధుల మొత్తాన్ని కోయస్కు తరలించేందుకు పకడ్బందీ ప్రణాళిక రచించింది శ్రీచైతన్య యాజమాన్యం. అసలు వర్సిటీ ఎడ్యుకేషన్ మేనేజ్మెంట్కి 16502002 షేర్స్ ఉంటే మెజార్టీ వాటా 15864560 షేర్లు కోయస్ ఎడ్యుకేషన్ మేనేజ్మెంట్ ఎల్.ఎల్.పి. అనే సంస్థకు కేటాయించింది. దీని నిర్వాహకులు బొప్పన సుష్మ, బొప్పన సీమ. వీరిద్దరూ వర్సిటీ ఎడ్యుకేషన్ మేనేజ్మెంట్ ప్రై.లి.కి చెందిన డైరెక్టర్సే. అంటే వర్సిటీ ఎడ్యుకేషన్ మేనేజ్మెంట్ ప్రై.లి.కి దాదాపు 95% వాటా కోయిస్ ఎడ్యుకేషన్ మేనేజ్మెంట్దే. వారి కంపెనీల్లో వారే పెట్టుబడులు పెట్టినట్టు చూపించి, వారి కంపెనీల్లో వారే షేర్లు కొనుకున్నట్లు చూపించి, వారి కంపెనీల్లోకి వారే షేర్లు అమ్ముకున్నట్లు చూపించి నల్లధనాన్ని తెల్లధనంగా మార్చుకుంటున్నట్లు ఆరోపణలు ఉన్నాయి.
ఒక ప్రై.లి. కంపెనీలో మరో ప్రై.లి. కంపెనీకి మెజారిటీ వాటాలు !
శ్రీచైతన్య యాజమాన్యం ఇప్పటికే పదుల సంఖ్యలో ప్రై.లి. కంపెనీల పేరు మీద షెల్ కంపెనీలు నెలకొల్పింది. అవసరాన్ని బట్టి కొన్ని కంపెనీల్లో అప్పుల రూపంలో వందల కోట్లు తరలించి ఆయా కంపెనీల షేర్లను వర్సిటీకి చెంది ఉండేటట్లు చూసుకుంటుంది. కానీ ఆయా సంస్థల్లో సంస్థాగత కార్యకలాపాలు నడవవు. ఉద్యోగులు ఉండరు, అన్నీ కాగితాల మీదే ఉన్నట్లు నడిపిస్తారు. ఏ ప్రై.లి. కంపెనీలో అయినా భాగస్వాములు, వాటాదారులు మాత్రమే ఉంటారు. కానీ శ్రీచైతన్య యాజమాన్యం నిర్వహించే ప్రై.లి. కంపెనీల్లో మాత్రం మరో ప్రై.లి. కంపెనీ భాగస్వామిగా ఉంటుంది. లిస్టెడ్ కంపెనీల్లో అయినా పెట్టుబడులు పెడుతున్నారా అంటే అదీ లేదు. అనామక, అన్లిస్టెడ్ కంపెనీల్లో పెట్టుబడులు పెడుతుండటం గమనార్హం. ఇలాంటి కార్యకలాపాలు నిర్వహించే కంపెనీలను షెల్ కంపెనీలుగా నిర్థారించటం జరిగింది. ఒక ప్రై.లి. కంపెనీలో మరో ప్రై.లి. కంపెనీలో మెజారిటీ వాటాలు కలిగి ఉండటం ఇది చట్టవిరుద్ధం. అంటే సదరు యాజమాన్యం తనకు చెందిన మరో ప్రై.లి. కంపెనీలో పెట్టుబడులు పెడుతుంది అంటే తమ కంపెనీల్లోని డబ్బు బయటకు పోకుండా ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకునేలా ఆయా కంపెనీల్లో అటు ఇటు తిప్పుకుంటోంది శ్రీచైతన్య. ఇలాంటి చర్యలకు పాల్పడే కంపెనీలను షెల్ కంపెనీలుగా పేర్కొంటూ పీఎంఓ మార్గదర్శకాలు విడుదల చేసింది. ప్రై.లి. కంపెనీల్లో భాగస్వాములు, వాటాదారులు మాత్రమే ఉండాల్సి ఉండగా, ఆ స్థానంలో కంపెనీలు రావటంతో త్వరలో కేంద్రప్రభుత్వం చర్యలకు ఉపక్రమించబోతోంది.
0 Comments