Ticker

6/recent/ticker-posts

Students Deaths : రైతు ఆత్మహత్యలకన్నా 3 రెట్లు అధికంగా విద్యార్థుల మరణాలు

  • ఒక్క 2022లో 1123 మంది తల్లిదండ్రులకు తీరని గర్భశోకం
  • న్యాయం చేయలేని ప్రభుత్వ విధానాలు !
  • ర్యాంకులకై కాలేజీల ఒత్తిడి...నలిగిపోతున్న విద్యార్థి !
  • ప్రభుత్వ నిబంధనలు ఏమాత్రం ఫాలో అవ్వని కార్పొరేట్‌ సంస్థలు !
  • ప్రభుత్వాలను కంట్రోల్‌ చేస్తున్న కార్పొరేట్‌ సంస్థలు !
  • తమ పిల్లల్ని కాపాడుకోవల్సిందే తల్లిదండ్రులే.

అమ్మా, నాన్న ! నన్ను క్షమించండి, ఇదే నాకు చివరి రోజు. మార్కులు ఎక్కువ రావాలని కాలేజీ స్టాఫ్‌ నన్ను వేధిస్తున్నారు. వాళ్ళ ఒత్తిడి భరించలేకపోతున్నాను. అందుకే చనిపోవాలనుకుంటున్నాను. తమ్ముడిని బాగా చదివించండి. ఇక్కడ మాత్రం చేర్పించవద్దు. హైద్రాబాద్‌ చైతన్యపురిలోని నారాయణ జూనియర్‌ కాలేజీలో మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థి వైభవ్‌ చనిపోయే ముందు వ్రాసిన సూసైడ్‌ నోట్‌ ఇది. మీర్‌పేటలోని తన ఇంటిలో ఫ్యాన్‌కి ఉరివేసుకున్న వైభవ్‌ సూసైడ్‌ నోట్‌ ప్రతి ఒక్కరిని కదిలించింది.

అమ్మా...నా తప్పు లేదు.

అమ్మా...నాన్న..సారీ. చనిపోతున్నందుకు నన్ను క్షమించండి, ప్రిన్సిపాల్‌, కాలేజ్‌ ఇన్‌ఛార్జ్‌, లెక్చరర్‌ పెట్టే టార్చర్‌ వల్లే ఆత్మహత్య చేసుకుంటున్నాను. హైద్రాబాద్‌ నార్సింగి శ్రీచైతన్య కాలేజీ విద్యార్థి ఎన్‌. సాత్విక్‌ ఆత్మహత్య చేసుకునే ముందు వ్రాసిన సూసైడ్‌నోట్‌ విద్యార్థుల దయనీయ స్థితికి అద్దం పడుతోంది. కార్పొరేట్‌ కాలేజీల్లో విద్యార్థుల మార్కులను బట్టి సెక్షన్‌లుగా విభజిస్తున్నారు. మార్కులు తక్కువ వచ్చాయంటూ సాత్విక్‌ కాలేజ్‌ ప్రిన్సిపాల్‌. ఇతర సిబ్బంది వేధించారు. తీరా తన మార్కుల కూడిక తప్పును గుర్తించిన సాత్విక్‌ లెక్చరర్‌, ప్రిన్సిపాల్‌కి చెప్పారు. వారు తప్పును సరిచేయకపోగా వేధించారు. నా తప్పు లేకపోయినా నన్ను కొట్టి వేధించారు అంటూ సాత్విక్‌ తన సూసైడ్‌నోట్‌లో రాసుకొచ్చాడు.  

తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల్లో ఒక్క 2022లోనే దాదాపు 1123 మంది విద్యార్థులు కేవలం ఒత్తిడి కారణంగానే బలవన్మరణాలకు పాల్పడ్డారు. ఏటేటా ఈ మరణాల సంఖ్య పెరుగుతూనే ఉంది. కానీ శ్రీచైతన్య, నారాయణ వంటి కార్పొరేట్‌ సంస్థలు ఏ మాత్రం మార్పులేదు. విద్యార్థులు బలవంతంగా ఉసురు తీసుకుంటున్న చర్యలు తీసుకున్న పాపాన పోలేదు. వారికీ వ్యాపారమే ముఖ్యం. డబ్బు సంపాదనే ధ్యేయం. తల్లిదండ్రుల కడుపుకోత వారికీ ఏ మాత్రం పట్టడు. చనిపోయిన విద్యార్థిపై ఒత్తిడి తట్టుకోలేకపోయాడు అని ఒక్క మాటతో తేల్చివేస్తున్నారు. డబ్బుతో కేసులను మాఫిచేయించుకుంటున్నారు. తెలుగు రాష్ట్రాలతో పాటు దేశంలోని పలు రాష్ట్రాల్లో చదువుల ఒత్తిడితో, పరీక్షలు ఫెయిలైన కారణంగా ప్రాణాలు తీసుకుంటున్న ఘటనలు ఏటా వేలల్లో చోటు చేసకుంటున్నాయి. రైతు ఆత్మహత్యలు కన్నా విద్యార్థుల ఆత్మహత్యలు 3 రెట్లు పెరిగినట్లు ఎన్‌సిఆర్‌బి 2022 నివేదిక పేర్కొంది. ఒక్క 2022 లో దేశవ్యాప్తంగా 13044 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు. అత్యధికంగా మహారాష్ట్రలో 1764 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకోగా, ఆంధ్రప్రదేశ్‌లో 575 మంది, తెలంగాణలో 543 మంది ఉన్నారు. వీరిలో 18 ఏళ్ళ లోపు ఉన్న ఇంటర్మీడియట్‌ తదితర తరగతుల విద్యార్థులే ఎక్కువ. 

తల్లిదండ్రులకు తీరని కడుపుకోత

కార్పొరేట్‌ కాలేజీల్లో చదివిస్తే పిల్లల భవిష్యత్తు బాగుంటుందని, బాగా చదువుకుని ఉన్నత స్థితికి వస్తారని ఎన్నో ఆశలతో కార్పొరేట్‌ కాలేజీల్లో చేర్పించే తల్లిదండ్రులకు చివరికి తీరని శోకం మిగులుతుంది. లక్షల్లో ఉన్న ఫీజులు చెల్లించేందుకు దొరికిన చోటల్లా అప్పులు చేసి మీర కార్పొరేట్‌ కాలేజీల్లో చేర్పిస్తే ఆ బిడ్డలే కళ్ళముందు కనిపించకుండా పోతున్నారు. తమ కోసం తల్లిదండ్రులు పడుతున్న కష్టాలను చూసి కార్పొరేట్‌ కాలేజీల్లో వేధింపులకు గురవుతున్నా పిల్లలు తమ తల్లిదండ్రులకు చెప్పుకోవటం లేదు. ఆ వేధింపులు మరింత ఎక్కువై చివరకు ఆత్మహత్యనే పరిష్కారంగా భావించి ప్రాణాలు తీసుకుంటున్నారు. కార్పొరేట్‌ కాలేజీల్లో బాగా చదివేవారు సైతం తీవ్ర వేధింపులకు గురువుతున్నారని సాత్విక్‌లాంటి విద్యార్థులు రాసే సూసైట్‌ నోట్‌లు సాక్ష్యాలుగా నిలుస్తున్నాయి.

‘‘ మా బాబు చాలా సున్నిత మనస్కుడు. ఎవరి జోలికి పోడు. చదువులో చురుగ్గా ఉండేవాడు, మార్కులు కూడా బాగా వచ్చేవి. టెన్త్‌లో 9.8 గ్రేడ్‌ వచ్చింది. వాడి జ్ఞాపకాలు మరచిపోలేకపోతున్నాము. మా బాబు మా ప్రాణం. ఎవరేమన్నా వాడిలో వాడే కుమిలిపోయేవాడు కానీ తన బాధను ఎవరికీ చెప్పుకునేవాడు కాదు. మా వాడు బాధపడుతున్నాడు అని తెలిస్తే అసలు ఆ కాలేజీకే పంపించే వాళ్ళము కాదు. పిల్లల భవిష్యత్తు బాగుండానికి కాలేజీల్లో చేర్పిస్తాం కానీ చంపుకోవడానికి చేర్పించలేదు. మా బాబు సూసైడ్‌ లెటర్‌లో కాలేజీలో ఎంతగా వేధిస్తున్నారో కూడా రాశాడు. కాలేజీ వాళ్ళు మాకు కడుపుకోత మిగిల్చారు. మా వాడికి మంచి మార్కులే వచ్చేవి. ఐఐటీలో సీటు సాధించాలని ఎంతగానో కష్టపడేవాడు. కాలేజీ టెస్ట్‌లో ఒకటి, రెండు మార్కులు తక్కువ వచ్చే సరికి వేధించారు. వాడిని రుద్ది రుద్ది చంపేశారు అని సాత్విక్‌ తల్లిదండ్రులైన ఆలివేలు, రాజ్‌ప్రసాద్‌లు తమ ఆవేదనను వెలిబుచ్చారు ’’

తీవ్ర ఒత్తిడిలో విద్యార్థి

ఇంటర్‌ మీడియట్‌ పరీక్షలు మరో రెండు నెలల్లో ప్రారంభం కానున్నాయి. ఈ సమయంలో కార్పొరేట్‌ కాలేజీలు తమ సంస్థ ర్యాంకుల కోసం విద్యార్థులపై ఒత్తిడిని పెంచుతున్నాయి. శ్రీచైతన్య, నారాయణ వంటి సంస్థల్లోని విద్యార్థులపై ఒత్తిడి తీవ్రంగా ఉంటుంది. విద్యాసంస్థలు తమ ర్యాంకుల కోసం విద్యార్థులను ఒత్తిడికి గురిచేస్తున్నాయి. హాస్టల్‌లోని విద్యార్థులనే కాదు, డే స్కాలర్‌ విద్యార్థులను రాత్రి 10 గంటల వరకు కాలేజీల్లోనే ఉంచుతున్నారు.  సబ్జెక్టుల్లోని ఇంపార్టెంట్‌ టాపిక్‌లను పదే పదే బట్టిపట్టిస్తున్నారు.  శ్రీచైతన్య,నారాయణ వంటి కాలేజీల్లో ఇంటర్మీడియట్‌ చదువు విద్యార్థుల పాలిట శాపంగా పరిణమించింది అంటే అతిశయోక్తి కాదు. కాలేజీల్లో చేరింది మొదలు విద్యార్థులు తీవ్రమైన ఒత్తిడికి లోనవుతున్నారు. పరీక్షల సీజన్‌ వచ్చిందంటే చాలు ఆ ఒత్తిడి భరింతలేనిదిగా మారుతోంది. డే స్కాలర్‌ల పరిస్థితి ఒకలా ఉంటే, హాస్టల్స్‌లో చదివే విద్యార్థుల పరిస్థితి మరీ దారుణంగా ఉంది. రోజూ తెల్లవారుజామున లేచింది మొదలు అర్థరాత్రి వరకు విరామమన్నదే లేకుండా చదువు ఒత్తిడిలో నలిగిపోతున్నారు. 


హాస్టళ్ళు కాదు అవి...నరకానికి నకళ్ళు !  

ఒక్క మాటలో చెప్పాటంటే కార్పొరేట్‌ కాలేజీ హాస్టళ్ళు నరకానికి నకళ్ళులా అనిపిస్తాయి. అద్దె భవనాల్లోని ఇరుకు గదుల్లో ఉండే ఈ కాలేజీల్లో ఒక్కో గదిలో 4 నుండి 6 మందిని ఉంచుతున్నారు. కొన్ని చోట్ల గదికో వాష్‌రూమ్‌ ఉంటే కొన్ని హాస్టళ్ళలో కామన్‌ వాష్‌రూమ్‌లు ఉన్నాయి. విద్యార్థులందరూ ఒకే సమయానికి కాలకృత్యాలు తీర్చుకునే వీలు లేక నేరుగా తరగతులకు వెళ్ళిపోవలసి వస్తుంది. దీని వలన ఆనారోగ్యం పాలవుతున్నారు. హాస్టల్‌ రూములను శుభ్రం చేయకపోవటం వల్ల అపరిశుభ్ర వాతావరణంలోనే విద్యార్థులు కాలం గడుపుతున్నారు. హాస్టళ్ళలో ఆహారం కూడా నాణ్యత ఉండదు. తక్కువ ఖర్చులో లభించే ఆహార పదార్థాలను హాస్టళ్ళలో ఎక్కువ సార్లు ఆహారంగా ఇస్తుంటారు. మరోవైపు ఆహార పదార్థాల గురించి ప్రశ్నించే విద్యార్థులకు వేధింపుల తప్పటం లేదు. దీంతో పిల్లలు అర్థాకలితో చదువును కొనసాగిస్తున్నారు. కొన్నిసార్లు సిబ్బందిని మేనేజ్‌ చేసి బయటనుండి ఆన్లైన్‌లో ఆహారం తెప్పించుకుంటామని మాదాపూర్‌ కార్పొరేట్‌ కాలేజీ హాస్టల్‌లో చదివే విద్యార్థులు తమ గోడు వెళ్ళ బోసుకున్నారు.

మూడు సబ్జెక్టుల చూట్టూనే..

ఇంటర్‌మీడియట్‌ సిలబస్‌ను పట్టించుకోకుండా జెఈఈ మెయిన్‌, అడ్బాన్స్‌డ్‌, నీట్‌ అంటూ కేవలం మేథ్స్‌, ఫిజిక్స్‌, కెమిస్ట్రీ వంటి మూడు సబ్జెక్టులపైనే ప్రముఖంగా బోధన సాగుతుంది. ఇతర సబ్జెక్టులను పరీక్షలకు 2 నెలల ముందు చదివిస్తున్నారు. అదీ కూడా బట్టీ పట్టించటం జరుగుతుంది. కేవలం మెయిన్‌ సబ్జెక్టులకు మాత్రమే ప్రాధాన్యత ఇవ్వటం మూలంగా ఇతర సబ్జెక్టుల గురించి పెద్దగా అవగాహన ఉండటం లేదు. ఒక్కో సబ్జెక్టుకు రెండేసి గంటల చొప్పున స్టడీ అవర్లు 6 గంటలు కొనసాగిస్తున్నారు. ఇక రెగ్యులర్‌ తరగతులు కూడా ఈ మూడు సబ్జెక్టులకే పరిమితం. ఒక్కో సబ్జెక్టుకు మూడు గంటల చొప్పున తరగతులు నిర్వహిస్తుంటారు. మార్కులను బట్టి బాగా చదివే వారిని ఒక సెక్షన్‌గా తక్కిన వారిని ఇతర సెక్షన్‌లుగా విడదీస్తున్నారు. క్రింద సెక్షన్‌లకు డిమోట్‌ అయ్యే పిల్లలు ఆత్మన్యూనతతో మరింత వెనుకబడుతున్నారు. బోధన ఒకే విధంగా ఉండే సంస్థలు పెట్టే పరీక్షలు విద్యార్థులను మరింత కుంగదీస్తున్నాయి. ప్రతీ రోజు ఎదో ఒక పరీక్ష పేరుతో విద్యార్థులను మానసిక ఒత్తిడికి గురిచేస్తున్నారు. ఒత్తిడి ఒకప్రక్క, పరీక్షల్లో ఫెయిల్‌ అవుతామోనని భయం మరోప్రక్క వేదనతో బలవన్మరణాలకు పాల్పడుతున్నారు.

పిల్లల స్థాయిని బట్టి ముందుకెళ్ళాలి

ఇంటర్‌మీడియట్‌ పిల్లలు చాలా సున్నింతంగా ఉంటారు. ఏ చిన్న సమస్య వచ్చినా తట్టుకుని నిలబడే మనస్థత్వం వారిలో తక్కువగా ఉంటుంది. పిల్లల మానసిక స్థితిగతులు, వారి చదువుల సామర్థ్యాన్ని చిన్న నాటి నుండే అంచనా వేసుకుని తల్లిదండ్రులు ముందుకు వెళ్ళాల్సి ఉంటుంది. పిల్లలకు అత్యధిక మార్కులు, ర్యాంకులు రావాలని అందరికీ ఒకే రీతిన పాఠాలు చెప్పటం వలన వాటిని అందుకునే స్థాయి లేని పిల్లలు వెనుకబడిపోతుంటారు. వారిని వేరే సెక్షన్‌లకు మార్చటం, మార్కుల కోసం ఒత్తిడి చేయటం వల్ల వారు మరింత కుంగుబాటుకు లోనవుతున్నారు. పిల్లల్లో సామార్ద్యాలను పెంచేలా కాలేజీల్లో బోధన ఉండాలే తప్ప ఒత్తిడి పెంచేలా ఉండకూడదు. తల్లిదండ్రులు కూడా తమ ఆశలను తమ పిల్లలపై రుద్దుతున్నారు. ఈ పరిస్థితులు మారేలా కాలేజీలతో పాటు తల్లిదండ్రులు జాగ్రత్తలు తీసుకోవాలసిన అవసరం ఎంతైనా ఉంది.

ఐఐటీల్లో చేరాక సీన్‌ రివర్స్‌

లక్షల్లో ఫీజుల ధారపోసి కార్పొరేట్‌ కాలేజీల్లో చేరిన విద్యార్థుల్లో అక్కడ నేర్పించిన బట్టి పట్టి పద్థతి కారణంగా సబ్జెక్టుల్లో ఫండమెంటల్స్‌పై పరిజ్ఞానం లోపిస్తోంది. రెండేళ్ళ పాటు నేర్చుకున్న ప్రశ్నలు సమాధానాలు ముక్కున పెట్టుకుని పరీక్షల్లో వ్రాస్తున్నారు. ఇలాంటి వారు జెఈఈలో ర్యాంకులు సాధించి ఐఐటిల్లో చేరాక గందరగోళ పడుతున్నారు. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల పిల్లలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బేసిక్‌ ఫండమెంటల్స్‌పై అవగాహన లేని వారు ఉన్నత తరగతుల్లోకి వెళ్ళె విద్యార్థులు ఆ తర్వాత ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఐఐటి, ఎన్‌ఐటీ, ఇతర ఇంజినీరింగ్‌ కాలేజీల్లో చేరే విద్యార్థుల్లో చాలా మందిలో ఇదే పరిస్థితి ఉంటోంది. ఫండమెంటల్ప్‌పై అవగాహన లేని విద్యార్థులు ఉన్నత విద్యలో ఒత్తిడికి గురువుతున్నారు. ఐఐటీల్లో సబ్జెక్టుల్ని అర్థం చేసుకోలేక పరీక్షల్లో ఫెయిల్‌ అవుతున్నారు. ఐఐటి చదువుతున్న విద్యార్థుల్లో 20% మందికి ఫస్ట్‌ ఇయర్‌ నుండే బాక్‌లాగ్‌లు ఉన్నాయని గణాంకాలు చెప్తున్నాయి. ఈ కారణాల వల్లనే పలువురు మధ్యలోనే చదువులు మానేస్తున్నారు. ఐఐటీల్లో అకడమిక్‌ ప్రెజర్‌ తట్టుకోలేక 2018 నుండి 2023 మధ్య 4400 మంది విద్యార్థులు డ్రాపవుట్‌ అయినట్లు కేంద్ర విద్యాశాఖ సహాయమంత్రి సుభాష్‌ సర్కార్‌ ఇటీవల రాజ్యసభలో వెల్లడిరచారు. కొన్ని సార్లు మనోస్థైర్యం కోల్పోయి తీవ్ర ఒత్తిడిలో ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. గత 5 ఏళ్ళలో 98 మంది ఐఐటీ, ఎన్‌ఐటీ విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నట్లు కేంద్రం పార్లమెంటులో ప్రకటించింది.

కార్పొరేట్‌ సంస్థలు ఏం చెప్తాయి ?

తెలుగు రాష్ట్రాల్లోని కార్పొరేట్‌ సంస్థల్లో చదివిన విద్యార్థుల ఐఐటీలు, ఎన్‌ఐటీలో సీటు సాధించిన తర్వాత కూడా సబ్జెక్టుల్ని అర్థం చేసుకోలేక పరీక్షల్లో ఫెయిల్‌ అవుతున్నారు. ఎక్కువ మంది విద్యార్థులు సబ్జెక్టు ఫండమెంటల్స్‌పై అవగాహన లేనివారే కావటం విచారకరం. కేవలం ర్యాంకులు తప్ప, విద్యార్థుల భవిష్యత్తు గురించి పట్టని కార్పొరేట్‌ కాలేజీల వల్ల లాభం కంటే నష్టమే ఎక్కువ జరుగుతోంది. ఇప్పటికైనా తల్లిదండ్రులు ఈ విషయాన్ని గుర్తించి అందరికీ అవగాహన కల్పించక పోతే మరింత మంది తల్లిదండ్రులకు కడుపుకోత తప్పదు.

పిల్లల్లో మానసిక స్థైర్యం నింపాల్సి బాధ్యత తల్లిదండ్రులదే !

మరో 2 నెలల్లో ఇంటర్‌మీడియట్‌ పరీక్షలు జరగనున్న నేపథ్యంలో తల్లిదండ్రులు తమ పిల్లలు ఒత్తిడికి గురి కాకుండా వారిలో ఆత్మస్థైర్యం నింపాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాలేజీల్లో, హాస్టళ్ళలో ఉండే తమ పిల్లలు స్వేచ్చగా మాట్లాడుతూ వారి పరిస్థితిని తెలుసుకోవాల్సి ఉంటుంది. వారిలో నిరంతరం ధైర్యం నింపుతూ భవిష్యత్తు  ఎంతో ఉందన్న ఆశను వారిలో కల్పించాలి. నిరంతరం తాము అండగా ఉన్నామన్న భరోసా వారికి ఇవ్వాలి. ఒత్తిడి, వేధింపులు లేకుండా కాలేజీ సిబ్బందితో ఎప్పటికప్పుడు మాట్లాడాలి. అప్పుడే విద్యార్థులు మానసిక స్థైర్యంతో పరీక్షలను విజయవంతంగా ఎదుర్కొనగలుగుతారు. అవాంఛనీయ సంఘటనలకు ఆస్కారముందడు. విద్యార్థులు మనోనిబ్బరంతో తమ లక్ష్యం సాధించే దిశగా అడుగులు వేయాలి. ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా స్థైర్యం కోల్పోరాదు. ప్రాణం ఉంటేనే ఏదైనా సాధించగలం, చనిపోతే ఏం సాధించలేమని యువత తెలుసుకోగలగాలి.

Post a Comment

0 Comments

Popular Posts

JEE ADVANCED 2025 : IIT ర్యాంకుల పేరుతో తల్లిదండ్రుల్ని బకరాల్ని చేస్తున్న శ్రీచైతన్య !
Sri Chaitanya : వర్సిటీ మూసివేత ! శ్రీచైతన్య ఉద్యోగుల్లో కలవరం ?
Digital India Bill : సైబర్‌ నేరాలకు చెక్‌ పెట్టేందుకు డిజిటల్‌ ఇండియా బిల్లు !
amitshah Comments 2g-3g-4g parties : కాంగ్రెస్‌, డీఎంకేలు తరాలుగా అవినీతిని కొనసాగిస్తున్నాయి
JEE MAIN 2025 ఫలితాల్లో మరో సరికొత్త మోసానికి తెరతీసిన శ్రీచైతన్య !
IT Rides on Sri Chaitanya : కొత్త తరహా మోసంలో శ్రీచైతన్య నేషనల్‌ రికార్డ్‌ !
IT RIDES : రూ. 230 కోట్లకు పైగా పన్ను ఎగవేతకు పాల్పడిన శ్రీచైతన్య !
corporate colleges gimmicks in neet results : ఓపెన్‌ కేటగిరీ ర్యాంకులే అసలైన ర్యాంకులు !
 Vizag MP Family Kidnap : విశాఖలో రెచ్చిపోయిన కిడ్నాపర్లు ! ఉలిక్కిపడ్డ తెలుగు రాష్ట్రాలు !
anasuya-talks-about-war-with-vijay : ఇంతటితో ముగించాలనుకుంటున్నా - అనసూయ