ఒలింపియాడ్స్ అంటే...
ప్రఖ్యాత
సంస్థలు దేశవ్యాప్తంగా స్కూల్ మరియు కాలేజీ స్థాయిలో ఈ ఒలింపియాడ్
పరీక్షలు నిర్వహిస్తాయి. ఈ పరీక్షలను ఎన్నో ప్రభుత్వ అనుబంధ, ప్రైవేటు
మరియు కొన్ని సేవాసంస్థలు విద్యార్థుల్లో స్కిల్స్ను మెరుగుపరచడానికి,
ప్రతిభావంతులుగా మలిచి ఆయా రంగాల్లో అవకాశాలు కల్పించడానికి, ఒలింపియాడ్
ఎగ్జామ్స్ను నిర్వహిస్తూ వస్తున్నాయి. ఈ పరీక్షల్లో విజయం సాధించిన వారికీ
స్కాలర్షిప్ అందించి ప్రోత్సహించటం ఈ సంస్థల ఉద్ధేశ్యం. ఒలింపియాడ్స్
నిర్వహించే సంస్థల్లో చాలా వరకు దశాబ్దాల అనుభవం ఉన్న సంస్థలు ఉన్నాయి.
ఎగ్జామ్స్ను ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నాయి. ఆ సంస్థ
సర్టిఫికేట్ అందుకుంటే ఒక గుర్తింపు, ఒక గౌరవం లభిస్తాయి. అలాంటి సంస్థల
స్థానంలో ప్రతిష్టాత్మక సంస్థల ఒలింపియాడ్స్ను పోలిఉండేలా ఫేక్ (నకిలీ)
ఒలింపియాడ్స్ను నిర్వహిస్తూ డబ్బులు దండుకునే ధోరణికి తెరతీశాయి.
దేశవ్యాప్తంగా ప్రఖ్యాత సంస్థలు నిర్వహించే ఒలింపియాడ్స్ను ప్రక్కకు
పెట్టిన శ్రీచైతన్య తన సొంత ఒలింపియాడ్స్ నిర్వహణకు తెరతీసింది.
INTSO EDUCATION పేరుతో 5 ఒలింపియాడ్స్.
దేశవ్యాప్తంగా ఎంతో పేరుప్రఖ్యాతులు ఉన్న ఒలింపియాడ్ ఎగ్జామ్స్కు ఉన్న క్రేజ్ను క్యాష్ చేసుకునేందుకు మ్యాథ్స్ టాలెంట్ సెర్చ్ ఒలింపియాడ్ (MTSO), ఆప్టిట్యూడ్ టాలెంట్ సెర్చ్ ఒలింపియాడ్ (ATSO) , ఇంగ్లీష్ టాలెంట్ సెర్చ్ ఒలింపియాడ్ (ETSO) , సైన్స్ టాలెంట్ సెర్చ్ ఒలింపియాడ్ (STSO) , జి.కె. టాలెంట్ సెర్చ్ ఒలింపియాడ్ (GTSO) పేరుతో అచ్చంగా ఒలింపియాడ్స్ను పోలిన విధంగా పేర్లు పెట్టి మొత్తం 5 రకాల ఒలింపియాడ్స్ను నిర్వహిస్తోంది శ్రీచైతన్య. ఈ ఒలింపియాడ్ పరీక్షల కోసం అన్నీ శ్రీచైతన్య స్కూల్స్లో ఉన్న విద్యార్థులందరిపై అదనపు భారం మోపుతోంది. 5 రకాల ఒలింపియాడ్స్ కోసం ఒక్కో పరీక్షకు రూ. 150/- చొప్పున 5 పరీక్షలకు గాను రూ. 750/- వసూలు చేస్తోంది శ్రీచైతన్య. 2022-23 విద్యాసంవత్సరానికి 4 లక్షల మంది విద్యార్థుల దగ్గర నుండి రూ. 750/- చొప్పున రూ.30 కోట్లు వసూలు చేసింది. గత 10 సంవత్సరాలుగా ఈ దోపిడీని నిరంతరాయంగా కొనసాగిస్తోంది. ఇలా ఎవరు పడితే వారు ఒలింపియాడ్స్ పేరును వాడుకుంటూ, ఇష్టానికి పరీక్షలను నిర్వహిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. ఆ కోవలోనే శ్రీచైతన్య తన బినామీ చేత ఐఎన్టీఎస్ఓ ఎడ్యుకేషన్ పేరుతో విజయవాడ వేదికగా ఒక సంస్థను ఏర్పాటు చేసింది. ఈ సంస్థలో పనిచేసే ఉద్యోగుల సంఖ్యను చూస్తే వేళ్ళపైనే లెక్కపెట్టవచ్చు. ఈ సంస్థకు ఒలింపియాడ్స్ రేంజ్లో ఆ స్టాండర్ట్స్ను అందుకునే ఉపాధ్యాయులు లేరు. వీరికంటూ విద్యారంగంలో సరైన గుర్తింపు లేదు. వీరికి ఉన్నదల్లా శ్రీచైతన్య అండదండలు మాత్రమే. పేపర్లు తయారు చేయటం దగ్గర నుండి పరీక్షలు నిర్వహించే బాధ్యత అంతా శ్రీచైతన్య స్కూల్స్ మరియు కాలేజీ ప్రిన్సిపాల్స్దే బాధ్యత. విచిత్రం ఏమిటంటే దేశవ్యాప్తంగా శ్రీచైతన్య స్కూల్స్లో చదివే విద్యార్థులు, శ్రీచైతన్య మేనేజ్మెంట్ అనుబంధంగా నడిచే ప్రైవేట్ స్కూల్స్లో చదివే విద్యార్థులు మాత్రమే ఈ పరీక్షల్లో పాల్గొంటారు. వేరే ప్రైవేట్ స్కూల్ విద్యార్థులు ఇందులో పాల్గొనక పోవటం గమనార్హం. కొన్ని గవర్నమెంట్ స్కూల్స్, మరికొన్ని చిన్న చిన్న ప్రైవేట్ స్కూల్స్ నిర్వాహకులకు ఒక ఎగ్జామ్కు 50/` చొప్పన డబ్బు ఆశ చూపి రిజిస్ట్రేషన్ చేసుకునేలా ఒప్పందాలు చేసుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి.
ఎవరీ రాధాకృష్ణ !
INTSO EDUCATIONకు యం.ఎస్.వి. రాధాకృష్ణ నిర్వాకులుగా వ్యవహరిస్తున్నారు. ఈయన శ్రీచైతన్య టెక్నో స్కూల్స్లో పనిచేసే ఓ ప్రముఖుడికి స్వయానా బావమరిది కావటం గమనార్హం. అలాగే ఎన్టీఎస్ఓ ఎడ్యుకేషన్ రీజనల్ మేనేజర్గా తోట మహాలక్ష్మీ, జనరల్ మేనేజర్గా టి. సంగీత విధులు నిర్వహిస్తున్నారు. శ్రీచైతన్య తరపున ఎగ్జామ్స్ నిర్వహిస్తోన్న సంస్థ ప్రతినిధి అయిన కొప్పారపు సుధీర్ (డైరెక్టర్స్ పి.ఏ)ను వివరణ అడుగగా, ఐఎన్టీఎస్ఓ ఎడ్యుకేషన్కి, క్యాట్ ఎడ్యుకేషన్కి శ్రీచైతన్యకు ఎలాంటి సంబంధం లేదని అకడమిక్ హెడ్ బి.వి. సతీష్ సూచనలకు అనుగుణంగా తన మెయిల్ నుండి పరీక్షలు నిర్వహించమని ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు. అలాగే బి.వి. సతీష్ని వివరణ అడుగగా ఐఎన్టీఎస్ఓ ఎడ్యుకేషన్ సంస్థ అనేది ఒక స్వతంత్ర సంస్థ అని ప్రకటిస్తున్నారు. కానీ శ్రీచైతన్య విద్యాసంస్థతో సంబంధం లేని ఒక ప్రైవేట్ వ్యక్తి నిర్వహించే ఒలింపియాడ్స్ను ఎందుకు నిర్వహిస్తున్నారు అంటే మాత్రం సమాధానం చెప్పలేకపోతున్నారు. ఈ ఒలింపియాడ్స్ అదనపు భారం అని తెలిసినా మీ స్కూల్స్లో ఎందుకు ప్రోత్సహిస్తున్నారు అంటే సమాధానం దాట వేస్తున్నారు. అసలు ఒలింపియాడ్స్ నిర్వహణకు రాధాకృష్ణకు ఉన్న అర్హత ఏంటి ? అనుభవం ఏంటి ? రాధాకృష్ణకు ఉన్న విశ్వసనీయత ఏంటి ? ఐఎస్టీఎస్ఓలో బోర్డ్ సభ్యులు ఎవరు ? ఇలా ఎవరు పడితే వారు ఒలింపియాడ్స్ను నిర్వహిస్తే శ్రీచైతన్య స్టూడెంట్స్తో రాయిస్తారా ? అంటే మౌనమే సమాధానం అయ్యింది. ఈ పరీక్షలకు సంబంధించి ఫీజును మాత్రం శ్రీచైతన్య స్కూల్స్ ట్రస్ట్ అయిన నెక్ట్స్జన్ ద్వారా వసూలు చేస్తున్నారు. నెక్ట్స్జన్ నుండి ఐఎన్టీఎస్ఓ ఎడ్యుకేషన్కి చెల్లిస్తున్నట్లు చెప్తున్నారు. కానీ అకౌంట్స్ వివరాలు అందించేందుకు నిరాకరించటం పలు అనుమానాలకు తావిస్తోంది. ఎన్ని చెప్పినా ఈ ఫేక్ ఒలింపియాడ్స్ వేళ్ళు అన్నీ శ్రీచైతన్య స్కూల్స్ వైపే చూపిస్తున్నాయి. పరీక్షకు సంబంధించిన అప్లికేషన్లు, ఎగ్జామ్ పేపర్లు అన్నీ శ్రీచైతన్య ఆధ్వర్యంలోనే తయారవుతున్నాయి. పరీక్షలు నిర్వహించేది శ్రీచైతన్య విద్యాసంస్థల్లోనే. విచిత్రం ఏమిటంటే ఈ ఒలింపియాడ్స్ అన్నీ శ్రీచైతన్య నిర్వహించే బినామీ ఒలింపియాడ్స్ అనే విషయం నిర్వహిస్తున్న స్కూల్స్ ప్రిన్సిపాల్స్కి తెలియకపోవటం ఆశ్చర్యకరం. అంత పకడ్బందీగా ఎవరికీ ఎలాంటి వివరాలు తెలియకుండా అంత గుట్టుగా వ్యవహారం సాగిస్తున్నారు. నిజం నిప్పులాంటింది, ఎప్పటికైనా దహించి వేయక మానదు. అలాగే ఇప్పుడు బయటపడిరది. మరోక విషయం ఏమిటంటే ఇతర ప్రైవేట్ స్కూల్స్ విద్యార్థులు శ్రీచైతన్యకు సంబంధించిన ఒలింపియాడ్ పరీక్షలు వ్రాయరు. దేశవ్యాప్తంగా కొన్ని ప్రఖ్యాత సంస్థలు నిర్వహించే ఒరిజినల్ ఒలింపియాడ్స్ను శ్రీచైతన్య పూర్తిగా ప్రక్కకు పెట్టేసింది. వాటి స్థానం శ్రీచైతన్య బినామీ ఒలింపియాడ్స్ను నిర్వహించటం గమనార్హం. అసలు ఐఎన్టీఎస్ఓ ఎడ్యుకేషన్, క్యాట్ వంటి ప్రైవేట్ సంస్థలు నిర్వహించే ఒలింపియాడ్ ఎగ్జామ్స్కు ప్రభుత్వం నుండి ఎలాంటి గుర్తింపు లేదు. కార్పొరేట్ సంస్థలు నిర్వహించే ఇటువంటి పరీక్షలను పూర్తిగా నిషేధం విధించాల్సి ఉంది. ఇలాంటి పరీక్షల వలన ఎలాంటి ప్రయోజనం ఉండకపోగా, పిల్లలపై అనవసర ఒత్తిడి పెంచతున్నామనే విషయాన్ని తల్లిదండ్రులు గ్రహించాలి. ఇలాంటి ఫేక్ ఒలింపియాడ్స్ పట్ల జాగ్రత్త వహిస్తూ, మోసాల పట్ల తల్లిదండ్రులే జాగరూకతతో వ్యహరించాలి. గత దశాబ్దకాలంగా దాదాపు 3.2 మిలియన్ల విద్యార్థులతో పరీక్షలు వ్రాయించి సుమారు రూ. 240 కోట్ల సొమ్ము లూటీ చేసింది. ఈ సొమ్ము అంతా ఎవరి జేబులోకి వెళుతోంది అని చిదంబర రహస్యం. ఆయా పోటీల్లో పాల్గొన్న విద్యార్థులకు 150 ల్యాప్టాప్లు, మెడల్స్, కన్సోలేషన్ బహుమతులు, మెరిట్ సర్టిఫికేట్లు ప్రదానం చేసి మిగిలిన కోట్లాది రూపాయలు దండుకుంటోంది. దీనిపై కేంద్ర దర్యాప్తు సంస్థల్కెన సి.బి.ఐ, ఈడీలతో దర్యాప్తు చేయించవలసిన అవసరం ఎంతైనా ఉంది.
నాలెడ్జ్ అసెస్మెంట్ టెస్ట్ (KAT)
KNOWLEDGE APTITUDE TEST (KAT) అనే ఓ ప్రముఖ సంస్థను కాపీ చేస్తూ KNOWLEDGE ASSESSMENT TEST (KAT) పేరుతో మరో 3 రకాల ఒలింపియాడ్స్ను నిర్వహిస్తోంది శ్రీచైతన్య. దీనికి కనీస గుర్తుంపు లేదు. అడ్రస్, ఫోన్ నంబర్లు ఫేక్. కానీ పరీక్షలు మాత్రం ఒక్క శ్రీచైతన్య విద్యాసంస్థల్లో నిర్వహిస్తోంది. 6 వ తరగతి నుండి 10 వ తరగతి చదువుతున్న విద్యార్థులను టార్గెట్ చేసుకుంది. ప్రతి ఎగ్జామ్కి చివరన ఒలింపియాడ్ అనే పదం చేర్చి విద్యార్థులను, తల్లిదండ్రులను నిలువుదోపిడీ చేస్తోంది. ఒక ఊరు, పేరు లేకుండా శ్రీచైతన్య ఎలా నిర్వహిస్తోంది అనేది శ్రీచైతన్య తల్లిదండ్రులకు సమాధానం చెప్పాలి. మ్యాథమేటిక్ అసెస్మెంట్ టెస్ట్ (MAT), ఫిజిక్స్ అసెస్మెంట్ టెస్ట్ (PAT), కెమిస్ట్రీ అసెస్మెంట్ టెస్ట్ (ChAT) పేరుతో ఒలింపియాడ్స్ నిర్వహిస్తోంది. ప్రతీ పరీక్షకు రూ. 200 వసూలు చేస్తోంది. మూడు పరీక్షలకు గాను రూ. 600/`లతో దాదాపు 2 లక్షల మంది విద్యార్థుల దగ్గర నుండి రూ. 12 కోట్లు వసూలు చేస్తోంది. గత 10 ఏళ్ళుగా దాదాపు 120 కోట్లు వసూలు చేసింది శ్రీచైతన్య. ఫీజులు చాలదన్నట్టు ఇదో రకమైన దోపిడీకి తెరతీసి...లేని పోటీ ప్రపంచాన్ని సృష్టించి పిల్లలపై తల్లిదండ్రుల ప్రేమను, వారి భవిష్యత్తును ఆసరా చేసుకుని అడ్డు అదుపు లేకుండా దోచుకుంటోంది. ఒక్క మాటలో చెప్పాలంటే మొత్తం స్కూల్ వ్యవస్థను దోపిడీకి అడ్డాగా మార్చుకుంది. పరీక్షల్లో మంచి ఫలితాలు సాధించిన మొదటి 10 లోపు విద్యార్థులకు లాప్ట్యాప్లు, నగదు బహుమతులు, సర్టిఫికెట్స్ ప్రదానం చేస్తోంది శ్రీచైతన్య.
ఒలింపియాడ్స్ విద్యార్థులపై అదనపు ఒత్తిడే !
మంత్లీ
ఎగ్జామ్స్, క్వాటర్లీ ఎగ్జామ్స్, ఆఫ్ఇయర్లీ ఎగ్జామ్స్, ప్రాక్టీస్
ఎగ్జామ్స్, ఫైనల్ ఎగ్జామ్స్ ఇలా విద్యార్థికీ ప్రతి రోజూ ఒక పరీక్షే.
పోటీ ప్రపంచం పేరుతో పరీక్షల మీద పరీక్షలు నిర్వహిస్తూ విద్యార్థుల
బాల్యాన్ని చిదిమేస్తూ, మరోవైపు చదువు పేరుతో మెదడుపై ఒత్తిడిని పెంచుతూనే
ఉన్నాయి కార్పొరేట్ సంస్థలు. ఇవి సరిపోవన్నట్లు కార్పొరేట్ సంస్థలు ఏ
పరీక్షలు చెబితే అవి గుడ్డిగా నమ్మి ఎగ్జామ్స్ పేరుతో మీ పిల్లలను
తీవ్రఒత్తిడికి గురి చేస్తూ, మరో వైపు సొమ్మును కోల్పోతున్నారు. ఇప్పటికైనా
మేల్కోకుంటే రాబోయే తరాలు ఒత్తిడితో పాటు మానసిక అనారోగ్యంతో బాధపడే
ప్రమాదం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. విద్యార్థులపై అంత ప్రేమ,
వారి భవిష్యత్తుకు బంగారు బాటలు వేస్తున్నామని చెప్పే శ్రీచైతన్య
స్టూడెంట్స్కి ఉచితంగా ఇలాంటి ఒలింపియాడ్స్ నిర్వహించవచ్చు కదా అనే
అభిప్రాయం తల్లిదండ్రుల నుండి వ్యక్తం అవుతోంది.
0 Comments