- 10000/- కట్టి సీటు రిజర్వు చేసుకోవాలంటూ హుకుం !
- లేదంటే సీటు లేదంటూ బ్లాక్మెయిలింగ్ !
- కార్పొరేట్ కాలేజీల మాయాజాలం, వచ్చే ఏడాది సీట్లు ఇప్పటికే బ్లాక్
- పదో తరగతి పరీక్షలకు ముందే సీట్ల కోసం పోటీ
- కృత్రిమ డిమాండ్ సృష్టిస్తున్న ప్రైవేటు కళాశాలలు
- తల్లిదండ్రుల బలహీనతే ఆసరాగా భారీ దందా
విద్యార్థి
దశలో ఇంటర్మీడియట్ కీలకం.. ఏ కాలేజీలో చేరితే బెటర్, ఏ కోర్సు తీసుకుంటే
మంచిదని 8,9 తరగతుల నుంచే తల్లిదండ్రులు, విద్యార్థులు మథనపడుతుంటారు.
ఇప్పుడీ బలహీనతే కార్పొరేట్ కాలేజీలకు వరంగా మారింది. పదోతరగతి పరీక్షల
షెడ్యూలే రాలేదు.. పరీక్షలు నిర్వహించనేలేదు.. ఫలితాలే వెలువడలేదు. కానీ
పలు కాలేజీల్లో ఇప్పటికే 2024-25 ఇంటర్ ఫస్టియర్ అడ్మిషన్లు పూర్తయ్యాయి
అంటూ కార్పొరేట్ కాలేజీలు ఇంటర్ అడ్మిషన్లలో కృత్రిమ కొరత సృష్టించి
తల్లిదండ్రుల్లో ఆందోళన రేకెత్తించి క్యాష్ చేసుకునేందుకు ఈ పన్నాగాన్ని
అమలు చేస్తున్నాయి. ప్రత్యేకించి గ్రేటర్ హైదరాబాద్లోని కార్పొరేట్
కాలేజీల్లోనే ఈ పరిస్థితి నెలకొన్నది. కాలేజీలు సీట్లు అయిపోతున్నాయంటూ
కృత్రిమ డిమాండ్ను సృష్టించి సొమ్ము చేసుకొంటున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్
పరిధిలోని కాలేజీల్లో సీట్లను బ్లాక్ చేస్తూ అందినకాడికి సొమ్ము
చేసుకుంటున్నాయి. అడ్వాన్స్డ్ బుకింగ్ పేరుతో సీట్లను బ్లాక్
చేస్తున్నారు. ఇప్పుడయితే రాయితీలిస్తాం.. ఆ తర్వాత ఫీజులు పెరుగుతాయంటూ
తల్లిదండ్రులను భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. కొంచెం ఆలస్యంగా వచ్చిన
వారి నుంచి భారీగా ఫీజులు గుంజుతున్నారు. ఈ కృత్రిమ పోటీతో తల్లిదండ్రులు
బెంబేలెత్తుతున్నారు. మంచి కాలేజీల్లో సీట్లు దొరకవేమోనన్న ఆందోళనలో
తల్లిదండ్రులు కాలేజీల వెంట పరుగులు పెడుతున్నారు. ఇంటర్బోర్డు అధికారులు ఈ
దందాను అరికట్టాలని తల్లిదండ్రులు కోరుతున్నారు. వాస్తవానికి పదోతరగతి
పరీక్షలు ముగిసి, ఫలితాలు వెల్లడిరచిన తర్వాత ఇంటర్బోర్డు ప్రవేశాల
నోటిఫికేషన్ను జారీచేస్తుంది. అప్పుడు ఫస్టియర్ కోర్సుల్లో విద్యార్థులకు
ప్రవేశాలకు కల్పిస్తారు. కానీ ఇది పేరుకు మాత్రమే జరిగే తంతు. కానీ
కార్పొరేట్ కాలేజీలు ముందుగానే అడ్మిషన్లు పూర్తిచేసుకొంటున్నాయి. ఇలా
చేయడం నిబంధనలకు విరుద్ధం. కానీ ఇంటర్విద్య అధికారుల పర్యవేక్షణలోపం..
కాలేజీలను అదుపుచేసే పరిస్థితి లేకపోవడంతో ఇలా జరుగుతున్నదని తల్లిదండ్రులు
పేర్కొంటున్నారు.
కొర్పొరేట్ విద్యాసంస్థలకు ఓ ప్రత్యేక రాజ్యాంగం...వారికంటూ ప్రత్యేక వ్యవస్థ !
కార్పొరేట్
స్కూల్స్ / కాలేజీల తీరే వేరు. చట్టాలతో వారికి పనిలేదు. ప్రభుత్వాలంటే
అంటే వారికీ లెక్కేలేదు. నిబంధనలు గురించి పట్టింపులేదు. కార్పొరేట్
స్కూల్స్/ కాలేజీలకి ఒక ప్రత్యేక రాజ్యాంగం నడిపిస్తున్నారు.
ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. వారికి కావాలసిన విధంగా వారే
నియమనిబంధనలు రూపొందించుకుంటారు, వారు చెప్పినవే రూల్స్, వారు నడిపేదే
వ్యవస్థ...వారికి నచ్చినట్టు నడుచుకునేలా ప్రభుత్వ అధికారులు మరియు
ప్రభుత్వాలను మార్చుకున్నారు. అన్నీ వారీ అధీనంలోకి వెళ్ళిపోయాయి. రూల్స్
విరుద్ధం అని ఎవరైనా అంటే కేసు వేసుకోండి, కోర్టులో తేల్చుకుందాం అంటూ
హుంకరింపులతో బెదిరింపులు. కోర్టుల్లో ఇప్పుడప్పుడే పరిష్కారం కావనే
ధీమా...అన్నింటినీ మించి వారు చేసిందే చట్టం...వారి నడిచిందే రాజ్యాంగం
అన్నట్లు తయారైంది తెలుగురాష్ట్రాల్లో కార్పొరేట్ విద్యాసంస్థల తీరు.
అడ్మిషన్లు లేవు...
వచ్చే
సంవత్సరానికి జూనియర్ ఇంటర్ బైపీసీ (నీట్) సీటు కోసం సీటు కోసం వెళితే
దిల్సుఖ్నగర్ పరిసర ప్రాంతాలు, ఉప్పల్లోని కొన్ని క్యాంపస్ల్లో
సీట్లు ఇప్పుటికే నిండిపోయాయి అంటూ కార్పొరేట్ కాలేజీలు కృత్రిమ కొరత
సృష్టిస్తున్నాయి. తల్లిదండ్రులను ఆందోళనకు గురి చేసి ఎక్కువ ఫీజు డిమాండ్
చేసే కుట్రకు పదును పెడుతోంది. ఏ ప్రైవేటు కాలేజీ అయినా ఒక్క అడ్మిషన్
కూడా వదులుకోదు. ఎందుకంటే వాళ్ళ కాసులే ముఖ్యం. సంవత్సరం మధ్యలో వచ్చినా
అడ్మిషన్లు ఇచ్చే కార్పొరేట్ కాలేజీలు కృత్రిమ కొరత సృష్టిస్తున్నాయి
అంటే ...తల్లిదండ్రుల దగ్గర ఎక్కువ ఫీజులు వసూలు చేయబోతున్నాయి అని అర్థం. ఈ
విషయం తెలియని తల్లిదండ్రులు కార్పొరేట్ కాలేజీల చుట్టూ చెప్పులరిగేలా
తిరుగుతున్నారు. పలు కాలేజీల్లో అడ్వాన్స్ బుకింగ్ కోసం తల్లిదండ్రుల
నుంచి రూ. 3వేల నుంచి రూ.11 వేల మధ్యలో టోకెన్ అడ్వాన్స్
కట్టించుకొంటున్నారు.
సెంట్రల్ క్యాంపస్లు పేరొందిన మాదాపూర్లో అన్ని
కార్పొరేట్ క్యాంపస్లో అడ్వాన్స్ బుకింగ్స్తో సీట్లు నిండాయి అని
చెప్తున్నారు. అడ్మిషన్ల కోసం ఎక్కువ డిమాండ్ చేసి మరోక క్యాంపస్ అద్దెకు
తీసుకుని దానిలో తరగతులు నిర్వహించేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఎంపీసీ
(జేఈఈ) శిక్షణ టాప్ బ్రాంచీలుగా పేరొందిన నల్లకుంట, విద్యానగర్ పరిసర
ప్రాంతాల్లోని కాలేజీలను సంప్రదిస్తే సీట్లు లేవన్న సమాచారమే
వినబడుతున్నది. మియాపూర్ పరిసర ప్రాంతాల్లో కాలేజీల్లో జేఈఈ మెయిన్,
అడ్వాన్స్డ్ కోచింగ్ బ్రాంచీల్లో సీట్లు నిండిపోయాయి.
ఆన్లైన్ అడ్మిషన్లే పరిష్కారం
విద్యావ్యవస్థను చెరపట్టిన కార్పొరేట్ విద్యాసంస్థలకు మూకుతాడు వేయకపోతే భవిష్యత్తులో మరింత ప్రమాదం ఏర్పడే అవకాశం ఉంది. కార్పొరేట్ విద్యాసంస్థల ఆగడాలను నిలువరించకపోతే విద్య కొందరికే అందుబాటులో ఉండే అవకాశం ఉంది. ఈ పరిస్థితులను చక్కదిద్దే బాధ్యత ప్రభుత్వ పెద్దలపైనే ఉంది. ప్రభుత్వాల నియంత్రణలోకి కార్పొరేట్ విద్యావ్యవస్థను తీసుకొస్తారా ? లేక కార్పొరేట్ విద్యావ్యవస్థ ఆధీనంలో ప్రభుత్వాలు ఉంటాయా ? అనేది తెల్చుకోవలసిన సమయం వచ్చేసింది. ఇంటర్ అడ్మిషన్ల అక్రమ దందాకు ఇంటర్లో కూడా ఆన్లైన్ అడ్మిషన్లే పరిష్కారమన్న వాదనలున్నాయి. ఇప్పటికే ‘దోస్త్’ ద్వారా డిగ్రీ కోర్సుల్లో ఆన్లైన్ అడ్మిషన్లను విజయవంతంగా చేపడుతున్నారు. ఎంసెట్ సహా అనేక వృత్తివిద్యాకోర్సుల్లో సీట్ల భర్తీని ఆన్లైన్ ద్వారానే నిర్వహిస్తున్నారు. ఏపీలో ఆన్లైన్ అడ్మిషన్ల చేపట్టేందుకు ఇంటర్బోర్డు ప్రయత్నాలు సాగించారు. మన దగ్గర కూడా ఇదే తరహాలో ఇంటర్లోనూ ఆన్లైన్లో అడ్మిషన్లు చేపట్టడం ద్వారా దందాను అరికట్టగలమని నిపుణులు సూచిస్తున్నారు. ఫీజుల దందాను అదుపుచేయవచ్చంటున్నారు.
0 Comments