- శ్రీచైతన్య, నారాయణ సంస్థల కక్కుర్తి !
- అత్యధిక స్టూడెంట్స్ ఉన్న సంస్థలు కావటంతో ఇష్టారాజ్యం
- సొంత స్టూడెంట్స్తోనే నకిలీ ఒలింపియాడ్స్ దందా !
మీ ఇంట్లో పిల్లలున్నారా ? వారు శ్రీచైతన్య, నారాయణ వంటి కార్పొరేట్ స్కూల్స్లో చదువుతున్నారా ? మీ పిల్లలు ఒలింపియాడ్ ఎగ్జామ్స్ కోసం పదే పదే ఫీజలు అడుగుతున్నారా ? మీరు కట్టే స్కూల్ ఫీజులతో పాటు ఒలింపియాడ్స్ ఎగ్జామ్స్ పేరుతో అదనపు ఆర్థిక భారాన్ని మోస్తున్నారా ? అయితే ఈ విషయం మీకోసమే. శ్రద్ధగా చదవండి. ఒక్కసారి గమనించండి. అసలు మీ పిల్లలు వ్రాసే ఒలింపియాడ్స్ స్టేట్ లెవలా ? నేషనల్ లెవలా ? ఇంటర్నేషనల్ లెవలా ? ఏ సంస్థ నిర్వహిస్తోంది ? ఆ ఎగ్జామ్స్కి ఉన్న విశ్వసనీయత ఎంత ? అని ఎప్పుడైనా ఆలోచించారా ? కనీసం మీ స్కూల్ యాజమాన్యాన్ని ప్రశ్నించారా ? అయితే మీరు కచ్చితంగా మోసపోతున్నారు. కావాలంటే ఒక్కసారి పరిశీలించండి. దేశవ్యాప్తంగా ఎన్నో ప్రభుత్వ అనుబంధ, ప్రైవేటు మరియు కొన్ని సేవాసంస్థలు విద్యార్థుల్లో స్కిల్స్ను మెరుగుపరచడానికి, ప్రతిభావంతులుగా మలచడానికి ఆయా రంగాల్లో అవకాశాలు కల్పించడానికి, విద్యార్థుల్లో విజయంసాధనపై ఆత్మవిశ్వాసం కల్గించడానికి ఒలింపియాడ్ ఎగ్జామ్స్ను నిర్వహిస్తున్నారు. వాటిల్లో చాలా వరకు దశాబ్దాల అనుభవం ఉన్న సంస్థలు ఉన్నాయి. ఎగ్జామ్స్ను ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నాయి. ఆ సంస్థ సర్టిఫికేట్ అందుకుంటే ఒక గుర్తింపు, ఒక గౌరవం లభిస్తాయి. అలాంటి సంస్థల్ని తోసిరాజని ఇప్పుడు శ్రీచైతన్య, నారాయణ వంటి సంస్థలు ఆయా ప్రతిష్టాత్మక సంస్థల ఒలింపియాడ్స్ను పోలిఉండేలా నకిలీ ఒలింపియాడ్స్ను నిర్వహిస్తూ డబ్బులు దండుకునే వ్యారారధోరణికి తెరతీశాయి. దేశవ్యాప్తంగా ప్రఖ్యాత సంస్థలు నిర్వహించే ఒలింపియాడ్స్ను ప్రక్కకు పెట్టి శ్రీచైతన్య, నారాయణ సంస్థలు తమ సొంత ఒలింపియాడ్స్ నిర్వహణకు తెరతీశాయి. దేశవ్యాప్తంగా ఉన్న శ్రీచైతన్య, నారాయణ స్కూల్స్లో అత్యధిక సంఖ్యలో ( శ్రీచైతన్య 6 లక్షల మంది, నారాయణలో 4 లక్షలకుపైగా) విద్యార్థులు చదువుతున్న స్కూల్స్ కావటం చేత వేరే ఒలింపియాడ్స్కి డబ్బులు చెల్లించటం ఇష్టలేక సొంతంగా ఒలింపియాడ్స్ నిర్వహణకు తెరతీశాయి. శ్రీచైతన్య, నారాయణ సంస్థలే సొంతంగా ఒక బినామీని ఏర్పాటు చేసుకుని వారి పేరు మీద సొసైటీ ఏర్పాటు చేసి ఆయా ఒలింపియాడ్ ఎగ్జామ్స్ను నిర్వహిస్తున్నట్లు పైకి కలరింగ్ ఇస్తూ ఇష్టారాజ్యంగా దోపిడీకి తెగబడుతున్నాయి. ఈ దెబ్బతో దేశంలోని ప్రముఖ ఒలింపియాడ్స్ అన్నీ విద్యార్థులు లేక వెలవెలబోతున్నాయి. దీంతో ఆయా స్వచ్ఛంద, ప్రైవేటు సంస్థలు సోషల్ మీడియా వేదికగా ప్రకటనలు ఇచ్చుకుంటున్నాయి. దాదాపు 10 లక్షల మంది విద్యార్థులు వ్రాయటం లేకపోవటంలో ప్రఖ్యాత, ప్రతిష్టాత్మక ఒలింపియాడ్ సంస్థలు ఓ సర్వేను నిర్వహించాయి. దాదాపు పెద్దపెద్ద సంస్థలన్నీ ఆయా స్కూల్స్, కాలేజీల్లో చదివే విద్యార్థులను వారు నిర్వహించే ఎగ్జామ్స్ వ్రాసే విధంగా కట్టడి చేస్తున్నాయని తేలింది. ఇలాంటి సొంత ఒలింపియాడ్స్ వలన విద్యార్థులకు ఎలాంటి గుర్తింపు లేకపోగా, పరీక్షల్లో అంత స్టాండర్డ్స్ లేవని తేలింది.
శ్రీచైతన్య నిర్వహించే నకిలీ ఒలింపియాడ్స్ ఇవే. (INTSO EDUCATION AND KAT (KNOWLEDGE ASSESSMENT TEST)
ఒలింపియాడ్స్ పేరును వాడుకుంటూ శ్రీచైతన్యయే INTSO EDUCATION పేరుతో ఓ బినామీ సంస్థలను నెలకొల్పి ఒలింపియాడ్స్ నిర్వహిస్తోంది. దేశవ్యాప్తంగా ఎంతో పేరుప్రఖ్యాతులు ఉన్న ఒలింపియాడ్ ఎగ్జామ్స్కు ఉన్న క్రేజ్ను క్యాష్ చేసుకునేందుకు మ్యాథ్స్ టాలెంట్ సెర్చ్ ఒలింపియాడ్ (MSTO), ఆప్టిట్యూడ్ టాలెంట్ సెర్చ్ ఒలింపియాడ్ (ASTO) , ఇంగ్లీష్ టాలెంట్ సెర్చ్ ఒలింపియాడ్ (ESTO) , సైన్స్ టాలెంట్ సెర్చ్ ఒలింపియాడ్ (STSO) , జి.కె. టాలెంట్ సెర్చ్ ఒలింపియాడ్ (GTSO) పేరుతో అచ్చంగా ఒలింపియాడ్స్ను పోలిన విధంగా పేర్లు పెట్టి మొత్తం 5 రకాల ఒలింపియాడ్స్ను నిర్వహిస్తోంది శ్రీచైతన్య. ఈ ఒలింపియాడ్ పరీక్షల కోసం అన్నీ శ్రీచైతన్య స్కూల్స్లో ఉన్న విద్యార్థులందరిపై అదనపు భారం మోపుతోంది. 5 రకాల ఒలింపియాడ్స్ కోసం ఒక్కో పరీక్షకు రూ. 150/- చొప్పున 5 పరీక్షలకు గాను రూ. 750/- వసూలు చేస్తోంది శ్రీచైతన్య. 2022-23 విద్యాసంవత్సరానికి 4 లక్షల మంది విద్యార్థుల దగ్గర నుండి రూ. 750/- చొప్పున రూ.30 కోట్లు వసూలు చేసింది. గత 10 సంవత్సరాలుగా ఈ దోపిడీని నిరంతరాయంగా కొనసాగిస్తోంది. విచిత్రం ఏమిటంటే దేశవ్యాప్తంగా శ్రీచైతన్య స్కూల్స్లో చదివే విద్యార్థులు, శ్రీచైతన్య మేనేజ్మెంట్ అనుబంధంగా నడిచే ప్రైవేట్ స్కూల్స్లో చదివే విద్యార్థులు మాత్రమే ఈ పరీక్షల్లో పాల్గొంటారు. వేరే ప్రైవేట్ స్కూల్ విద్యార్థులు ఇందులో పాల్గొనక పోవటం గమనార్హం. కొన్ని గవర్నమెంట్ స్కూల్స్, మరికొన్ని చిన్న చిన్న ప్రైవేట్ స్కూల్స్ నిర్వాహకులకు డబ్బు ఆశ చూపి పెద్దఎత్తున రిజిస్ట్రేషన్ చేసుకునేలా ఒప్పందాలు చేసుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి.
0 Comments