నిజాలు తేలాలి అంటే ఎన్ఐఏ, సిబిఐ ఏంక్వైరీ వేయాలి
విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ భార్య, కొడుకు, ఆడిటర్ కిడ్నాప్ కేసుపై సంచలన వ్యాఖ్యలు చేశారు బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు విష్ణుకుమార్ రాజు.. ఎంపీ కుటుంబం కిడ్నాప్ కేసులో కుట్ర దాగి ఉందన్న ఆయన.. ఈ కేసును సీబీఐ, ఎన్ఐఏతో విచారణ జరిపించాలని కోరారు. ఎంపీ కుటుంబం కిడ్నాప్ ఆశ్చర్యానికి గురి చేసిందన్న ఆయన.. ఎంపీ ఇంటికి ఒక ఆకు రౌడీ వెళ్లాడంటే సాధారణమైన విషయం కాదు. దీని వెనుక పెద్ద కుట్ర దాగి వుందనే అనుమానం కలుగుతోందన్నారు. సినిమా స్టోరీని మించిన నిజంగా జరిగిన ఘటన ఇది. ఈ ఘటన వెనుక ఎంపీ బయటకు చెప్పుకోలేని విషయాలు దాగి ఉన్నాయి అన్నారు. భార్య, కుమారుడు ఎక్కడ ఉన్నారో ఎంవీవీ ఎందుకు గమనించలేదని అంతుబట్టని విషయమన్న ఆయన, ఎంపీ కొడుకు ఫోన్ చేస్తే.. రోజు స్టేషన్కు రావాల్సిన రౌడీషీటర్ కదలికలను వదిలేస్తారా..? అని ప్రశ్నించారు. విశాఖలో అరాచక శక్తులు తిరుగుతున్నాయని స్వయంగా కేంద్ర హోం మంత్రి హెచ్చరించారని గుర్తుచేశారు విష్ణుకుమార్ రాజు.. అది జరిగిన రెండు రోజుల్లోనే ఎంపీ కుటుంబం బాధితులుగా మారాన్న ఆయన.. గంజాయి మత్తులో జరిగిన అరాచకం గురించి తెలుసుకుని నివ్వెరపోవాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు.. ఎంపీ ఫ్యామిలీకి ఇబ్బంది కలిగితే ప్రతిపక్ష పార్టీలు సంబరాలు చేసుకుంటున్నారని వైసీపీ నాయకులు దిక్కుమాలిన మాటలు మాట్లాడుతున్నారంటూ ఫైర్ అయ్యారు. ఇక, ఈ వ్యవహారంలో కడప, పులివెందుల బ్యాచ్లు ఉన్నాయనే ప్రచారం జరుగుతోందని ఆరోపించారు.. సెల్ ఫోన్ డేటా బయటకు తీస్తే మొత్తం వ్యవహారం బయటకు వస్తుందని సూచించారు. ఇక, ఈ కేసులో ఏపీ పోలీసులు నిస్పాక్షిక విచారణ జరుపుతారన్న నమ్మకం లేదన్నారు విష్ణుకుమార్ రాజు.. నిజాలు తేలాలంటే థర్డ్ పార్టీ ఎంక్వైరీ చేయాల్సిందేనని డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్లో ఉత్తరప్రదేశ్ మోడల్ పోలీసింగ్ అమలు చేస్తేనే అరాచకాలు తగ్గుతాయని సూచించారు. ఇది కిడ్నాప్ కాదు.. సెటిల్ మెంట్ వ్యవహారం అనేది మా అభిప్రాయంగా పేర్కొన్నారు. ఇచ్చుపుచ్చుకునే దగ్గర తేడాలా..? లేక ఇతర కారణాలా..? అనేది విచారించాలని డిమాండ్ చేశారు బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు విష్ణుకుమార్ రాజు. కాగా, ఎంపీ ఫ్యామిలీ కేసులో పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది.. ఇప్పటికే నిందితులను అదుపులోకి తీసుకున్నారు విశాఖ పోలీసులు.
0 Comments