- ప్రకటించిన 29 ఓపెన్ కేటగిరీ ర్యాంకుల్లో 20 డీఎల్పీ (డిస్టెన్స్ లెర్నింగ్ ప్రోగ్రామ్) ర్యాంకులే !
- శ్రీచైతన్యకు టాప్ 10 లోపు ఒక్కటంటే ఒక్క ర్యాంకు రాలేదు.
- టాప్ ర్యాంకుల మోజులో తల్లిదండ్రులు, క్యాష్ చేస్తుకుంటున్న శ్రీచైతన్య !
- నిజాలు తెలుసుకోలేక మోసపోతున్న తల్లిదండ్రులు !
- ఓపెన్ కేటగిరీ ర్యాంకులే అసలైన ర్యాంకులు, ఆల్ కేటగిరీ ర్యాంకులకు విలువే లేదు.
- వేరే కాలేజీలు సాధించిన ర్యాంకుల్ని తన ర్యాంకులుగా ప్రకటిస్తున్న శ్రీచైతన్య !
- లేని ప్రతిష్టకు పోయి నమ్మకాన్ని పోగొట్టుకుంటున్న శ్రీచైతన్య.
- బీటలు వారుతున్న శ్రీచైతన్య విశ్వసనీయత !
- శ్రీచైతన్య జేఈఈ అడ్వాన్స్డ్ ప్రకటనలో షరతులతో అసలు విషయం తేటతెల్లం.
ఫలితాలు వచ్చిన ప్రతిసారి జిమ్మిక్కులు చేయటంలో శ్రీచైతన్య ఆరితేరింది. జేఈఈ అడ్వాన్స్డ్ 2025 ఫలితాల్లో శ్రీచైతన్య తన మోసపూరిత నైజాన్ని మరోసారి బయటపెట్టుకుంది. విద్యార్థుల్ని, తల్లిదండ్రుల్ని తన ప్రకటనలతో బురిడీ కొట్టించాలని ప్రయత్నించింది. ప్రకటనల్లో అబద్దాలు అచ్చేసి అడ్డంగా దొరికిపోయింది. జేఈఈ అడ్వాన్స్డ్ ఆలిండియా ఓపెన్ కేటగిరీలో 100 లోపు 29 ర్యాంకులు శ్రీచైతన్య విద్యార్థులు సాధించినట్లు పేర్కొంది. కానీ వారిలో 20 మంది డిఎల్పి (డిస్టెన్స్ లెర్నింగ్ ప్రోగ్రామ్)/ ఏఐటిఎస్ (ఆలిండియా టెస్ట్ సిరీస్) కి చెందిన విద్యార్థులవే అని శ్రీచైతన్య తన రెండు పేజీల ప్రకటనలో తెలిపింది. కానీ అది ఎవరికీ అర్థం కాకుండా చిన్న స్టార్ మార్క్ పెట్టి మోసగించింది. స్టార్ మార్క్కు అర్థం ఏమిటంటే ఆ ర్యాంకులు అన్నీ డిస్టెన్స్ లెర్నింగ్ ప్రోగ్రామ్ లేదా ఆలిండియా టెస్ట్ సిరీస్ ద్వారా చదివిన విద్యార్థులవి అని శ్రీచైతన్యయే తన ప్రకటనతో స్పష్టంగా పేర్కొంది. మొదటి 100లోపు ర్యాంకుల్లోనే ఇన్ని డి.ఎల్.పి. ర్యాంకులు ఉంటే 1000 లోపు ర్యాంకుల్లో ఇంకా ఎన్ని డి.ఎల్.పి. ర్యాంకులు ఉన్నాయో మీరే ఊహించండి. శ్రీచైతన్య మోసాలకి జేఈఈ అడ్వాన్స్డ్ ర్యాంకులే పరాకాష్ట.
డిస్టెన్స్ లెర్నింగ్ ప్రోగ్రామ్ ముసుగులో ర్యాంకుల కొనుగోలు
నేటి పోటీ ప్రపంచంలో ఎక్కువ ర్యాంకులు కనిపించకపోతే ఎక్కడ అడ్మిషన్లపై ప్రభావం చూపుతుందో అనే భయంతో శ్రీచైతన్య ఎక్కువ ర్యాంకులు చూపేందుకు అడ్డదారులు వెతుకుతుంది. ఇతర రాష్ట్రాల్లో అంతగా పేరు లేని సంస్థల్లో ర్యాంకులు తెచ్చుకున్న విద్యార్థులతో శ్రీచైతన్య డిస్టెన్స్ లెర్నింగ్ ప్రోగ్రామ్ క్రింద రిజిస్టర్ చేసుకున్నట్లు చూపిస్తూ అనైతిక చర్యలకు పాల్పడుతోంది. ఇలా ర్యాంకులు కొనుగోలు చేసేందుకు తెరవెనుక పెద్ద స్థాయి వ్యక్తులు మధ్యవర్తులుగా వ్యవహరిస్తుండటం గమనార్హం. ఇలా ఇతర సంస్థలు మరియు ఆయా ర్యాంకర్ల దగ్గర డిఎల్పి / ఏఐటిఎస్ పేరుతో గతంలోనే తమ సంస్థల్లోనే రిజిస్టర్ చేసుకున్నట్లు చూపుతుండటం విశేషం. ఇలా అన్ని సంస్థలు కలిసి తల్లిదండ్రుల్ని, విద్యార్థుల్ని మోసగించటంలో తలమునకలై ఉన్నాయి. ఒక ర్యాంకును ఎంత మంది ప్రకటిస్తారు ? అనే వారు లేక పోవటంతో అంతా కార్పొరేట్ సంస్థల ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాయి. విద్యారంగాన్ని ఫక్తు వ్యాపారంగా మార్చుకుని కోట్లాది రూపాయలు దండుకుంటున్నాయి.
నానాటికీ తీసికట్టుగా శ్రీచైతన్య ఐఐటి ఫలితాలు !
ఐఐటిలో మొదటి నుండి శ్రీచైతన్య వీక్ అనే అపవాదు ప్రజల్లో బలంగా నాటుకుని ఉంది. అందుకు తగినట్టే రోజురోజుకి ఫలితాల్లో దిగజారిపోతుంది. జేఈఈ అడ్వాన్స్డ్ 2025లోనూ శ్రీచైతన్య ఫలితాలు మరీ దారుణంగా పడిపోయాయి. శ్రీచైతన్య ప్రకటించిన ఫస్ట్ ర్యాంకు ఈ.డబ్యూ.ఎస్. కేటగిరీకి చెందిన ర్యాంకు కానీ ఆలిండియా ఓపెన్ కేటగిరీ ర్యాంకుల్లో కలిపి ప్రజల్ని నమ్మించే ప్రయత్నం చేస్తోంది. ఇక పోతే ఆలిండియా ఓపెన్ కేటగిరీ ర్యాంకుల్లో 29 ర్యాంకులు శ్రీచైతన్య ప్రకటిస్తే అందులో కేవలం 20 ర్యాంకులు డి.ఎల్.పి. ర్యాంకులే. అంటే ఇతర సంస్థల క్లాస్రూమ్లో చదువుకున్న విద్యార్థులే. కేవలం శ్రీచైతన్య ఆన్లైన్లో రిజిస్టర్ చేసుకున్న విద్యార్థులని గమనించగలరు. 3, 5, 6, 16, 23, 27, 30, 34, 36, 37, 42, 45, 52, 54, 59, 63, 64, 87, 91, 95 ర్యాంకుల్లో ఏ ఒక్కటీ శ్రీచైతన్యది కాదు అంటే నమ్మగలరా ? కానీ అదే నిజం. శ్రీచైతన్య ప్రకటించిన ఆలిండియా 3 వ ర్యాంకు సాధించిన మాజిద్ ముజాహిద్ హుసేన్ మధ్యప్రదేశ్లోని బర్హాన్పూర్కి చెందిన వ్యక్తి ఇతను మ్యాక్రో విజన్ అకాడమీ చెందిన వ్యక్తిగా ఆ సంస్థ ప్రకటించింది. ఇక పోతే 5 వ ర్యాంకు సాధించిన విద్యామందిర్ క్లాసెస్ అనే సంస్థకు చెందిన స్టూడెంట్, 6 వ ర్యాంక్ అలెన్ సంస్థకి చెందినది, 11 వ ర్యాంక్ మోషన్ సంస్థకి చెందిన విద్యార్థి...ఇక 16 వ ర్యాంక్ వెస్ట్బెంగాల్కి చెందిన పాత్ఫౌండర్ సంస్థ విద్యార్థిది. ఇలా చెప్పుకుంటూ పోతే ప్రకటించిన 29 ఓపెన్ కేటగిరీ ర్యాంకుల్లో 20 ర్యాంకులు వేరే సంస్థల ర్యాంకులే. శ్రీచైతన్య ఇలా ఎందుకు దిగజారింది అనే ప్రశ్న అందరిలోనూ తలెత్తుతుంది. శ్రీచైతన్యలో సరైన లెక్చరర్స్ లేకపోవటంతోనే ఇలాంటి అధ్వానమైన ఫలితాలు వస్తున్నాయని విద్యార్థులు పేర్కొంటున్నారు.
ఓపెన్ కేటగిరీ ర్యాంకులే అసలైన ర్యాంకులు !
ఆల్ కేటగిరీ ర్యాంకులతో ఎక్కువ ర్యాంకులు చూపిస్తూ తెలుగు రాష్ట్రాల్లోని తల్లిదండ్రులను మోసం చేయటం శ్రీచైతన్య వంటి కార్పొరేట్ సంస్థలకు అలవాటుగా మారింది. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) విడుదల చేసిన ఓపెన్ కేటగిరీ లేదా జనరల్ కేటగిరీ ర్యాంకులే అసలైన ర్యాంకులుగా పరిగణనలోకి తీసుకోవల్సి ఉంటుంది. కానీ చాలా వరకు కార్పొరేట్ సంస్థలు ఆల్ కేటగిరీ ర్యాంకులను ప్రకటిస్తూ ఓపెన్ కేటగిరీ ర్యాంకులుగా మభ్యపెడుతున్నాయి. ఉత్తరాది (నార్త్) రాష్ట్రాల్లో ఇలాంటి జిమ్మిక్కులు నడవవు. మన తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన సంస్థలు నార్త్లో హవా కొనసాగిస్తున్నా అక్కడ ప్రకటించేది కేవలం ఓపెన్ కేటగిరీ ర్యాంకులే. జేఈఈ అడ్వాన్స్డ్ కౌన్సిలింగ్ సమయంలో ఎలాంటి రిజర్వేషన్ లేని వారికి ఓపెన్ కేటగిరీ ర్యాంకులు, రిజర్వేషన్ కేటగిరీ ఉన్న వారికీ రిజర్వేషన్ కేటగిరీనీ పరిగణనలోకి తీసుకుంటారు. తెలుగు రాష్ట్రాల్లో వేసిన పేపరు ప్రకటనను ఉత్తరాది రాష్ట్రాల్లో వేయకపోవటం గమనార్హం. ఎందుకంటే ఉత్తరాది రాష్ట్రాల్లో ఇలాంటి జిమ్మిక్కులు నడవవు. అక్కడ శ్రీచైతన్య కేవలం ఓపెన్ కేటగిరీ ర్యాంకులు మాత్రమే ప్రకటిస్తుంది. కావాలంటే శ్రీచైతన్య వెబ్సైట్లోని గతం 2023, 2024 తాలుక రిజల్ట్స్ పేజీని పరిశీలిస్తే మీకే అర్థం అవుతుంది. అదే తెలుగు రాష్ట్రాలకు వచ్చే సరికి అన్ని కేటగిరీ ర్యాంకులు కలిపి ప్రకటిస్తుంది. ఎందుకంటే తెలుగు రాష్ట్రాల్లో శ్రీచైతన్య చెప్పిందే వేదం. శ్రీచైతన్య ఏది చెబితే అదే కరెక్ట్ అని నమ్మే అమాయక తల్లిదర్రడులు ఉన్నారు కాబట్టే మోసం చేయటం ఈజీ అవుతోంది. అసలు 100 లోపు ఇన్ని ర్యాంకులు ఒకే సంస్థకు ఎలా సాధ్యమవుతున్నాయి అనేది అర్థం కాక సామాన్యులు సైతం విస్తుపోవటం కనిపిస్తుంది. అసలు విషయం ఏమిటంటే జెఈఈ మెయిన్లో లెక్కలోకి తీసుకోవలసింది ఓపెన్ కేటగిరీ ర్యాంకులు మాత్రమే. అన్ని కేటగిరీ ర్యాంకులు ప్రకటించి ప్రజల్ని కన్యూజ్ చేసి అందరికంటే ఎక్కువ ర్యాంకులు వచ్చాయి అని భ్రమింపజేసి తెలుగు రాష్ట్రాల ప్రజల్ని మోసం చేయటం దశాబ్దాలుగా కొనసాగుతోంది.
వందలాది బ్రాంచీలు సాధించిన ఫలితాలు ఇవి !
అసలు ఈ ర్యాంకులన్నీ ఒకే బ్రాంచీ నుండి సాధించినట్టు చెప్పుకోవటం గమనించదగ్గ విషయం. దేశంలోని వందలాది బ్రాంచీలను నిర్వహిస్తున్న శ్రీచైతన్యలోని కేవలం 10 నుండి 15 బ్రాంచీల నుండి సాధించిన ర్యాంకులు మాత్రమే. అంటే మిగతా వాటిల్లో లక్షల్లో ర్యాంకు సాధించిన వారే. ఓపెన్ కేటగిరీలో 10 లోపు, 100 లోపు ర్యాంకులు ప్రకటించే శ్రీచైతన్య, అసలు మొత్తం అన్ని బ్రాంచీల నుండి ఎంత మంది విద్యార్థులు పరీక్ష వ్రాశారో ప్రకటనల్లో చూపరు. ఎందుకంటే వారి సక్సెస్ రేటు చెప్పుకోలేనంత దారుణంగా ఉంటుంది. జేఈఈ మెయిన్లో ఒక్క శ్రీచైతన్య నుండి జేఈఈ అడ్వాన్స్డ్కు అర్హత సాధించిన వారు 22094 మంది కాగా, జేఈఈలో ర్యాంకులు సాధించిన వారు కేవలం 4212 మంది అని స్వయంగా శ్రీచైతన్య తన ప్రకటనల్లో పేర్కొంది. అంటే దాదాపు 17800 మంది సీట్లు సాధించలేదు అన్న మాట. ఇదీ శ్రీచైతన్య సక్సెస్. ఒకటి, రెండు ర్యాంకులు చూసి కార్పొరేట్ సంస్థల వెంట పరుగులు పెట్టే తల్లిదండ్రులు ఉన్నంత కాలం ఆయా సంస్థలు మోసం చేస్తూనే ఉంటాయి. సో...బికేర్ ఫుల్ పేరేంట్స్.
0 Comments