ర్యాంకులు చూసి మోసపోకండి !
మీ పిల్లలకు మంచి భవిష్యత్తు అందిస్తాం అంటూ నాలుగు ర్యాంకులు చూపిస్తే చాలు వారిని గుడ్డిగా నమ్మే స్థితిలో ఉన్నారు నేటి తల్లిదండ్రులు. అదే ఏది మంచి, ఏది చెడు, ఏది సత్యం, ఏది అసత్యం అని తెలుసుకోలేని ఓ సందిగ్థావస్థలో ఉన్నారు. తల్లిదండ్రుల అమయకత్వాన్ని ఆసరా చేసుకుని అడ్మిషన్లు దండుకునే పనిలో ఉంది శ్రీచైతన్య. ర్యాంకు వచ్చే విద్యార్థి దగ్గర అదే ఫీజు తీసుకుంటున్నారు, ర్యాంకులు రాని విద్యార్థుల దగ్గర అదే ఫీజులు తీసుకుంటున్నారు కదా, మరి మీరు అడిగినంత ఫీజులు చెల్లిస్తాం అదే ఆలిండియా ఫస్ట్ ర్యాంక్ సాధింపజేస్తారా ? అని తల్లిదండ్రులు ప్రశ్నిస్తే..గ్యారెంటీ ఇచ్చే వాళ్ళు ఒక్కరంటే ఒక్కరూ ఉన్నారా ? అంటే... మీ పిల్లాడు బాగా చదివితే ర్యాంకు వస్తుంది, మేము గైడెన్స్ మాత్రమే ఇస్తాం అని చేతులు దులుపుకుంటున్నారు. దేశవ్యాప్తంగా జెఈఈ మెయిన్ 2023 లో దేశవ్యాప్తంగా 9 లక్షలకు పైగా విద్యార్థులు పరీక్ష వ్రాయగా వారిలో 2.5 లక్షల మంది విద్యార్థులు ఒక్క శ్రీచైతన్య విద్యాసంస్థల నుండి మాత్రమే రాశారు. కానీ ర్యాంకులు సాధించిన విద్యార్థులు 30000 మంది. మిగిలిన 2,20,000 మంది భవిష్యత్తు ఏంటి ? ఈ 30000 వేల మంది జెఈఈ అడ్వాన్స్డ్ ఎగ్జామ్ వ్రాయగా వచ్చిన ర్యాంకులు 3621. ఇది శ్రీచైతన్య ప్రకటనలోని ర్యాంకులే. అలాగే నీట్ 2023లో శ్రీచైతన్యలో చదివిన విద్యార్థుల సంఖ్య దాదాపు 54000 మంది, శ్రీచైతన్య సగర్వంగా ప్రకటించిన ర్యాంకులు 8793, శ్రీచైతన్యలోనే చదివి మిగిలిన 45000 మంది మెడికల్ ర్యాంకులు సాధించలేని వారి పరిస్థితి ఏంటి ? దీనిని బట్టి ఏమి అర్థం అవుతుంది అంటే స్వతహాగా ప్రతిభావంతులకే ర్యాంకులు వస్తాయి. విద్యార్థులు చదివితేనే ర్యాంకులు వస్తాయి, శ్రీచైతన్య చెబితే కాదు అన్న విషయం గ్రహించాలి. ఒకవేళ శ్రీచైతన్య టీచింగ్ అంత గొప్పదైతే...శ్రీచైతన్యలో చదువుతున్న ప్రతి ఒక్కరికీ ఒకటో ర్యాంకు ఎందుకు రావటం లేదో. సమాధానం చెప్పగలరా ?
విద్యార్థిపై తీవ్రమైన ఒత్తిడి !
ఒక నెలలో పూర్తిచేయవలసిన పాఠాలు 5 రోజుల్లో పూర్తి, మూడు నెలల్లో పూర్తి చేయవలసిన పాఠాలు ఒక నెలలో పూర్తి, 6 నెలల్లో పూర్తి చేయవలసిన సిలబస్ను 2 నెలల్లో కంప్లీట్ చేయటం వివిధ సబ్జెక్టులు ఒకేసారి బ్రెయిన్లోకి ఎక్కించే ప్రయత్నం చేయటం, అర్థం అవుతుందో, లేదో తెలుసులేకపోవటం, సబ్జెక్టుల్ని పూర్తి నిర్లక్ష్యం వహించటం, మ్యాథ్స్,సైన్స్ సబ్జెక్టులకే అధిక ప్రాధాన్యం ఇవ్వటం, రోజువారీ పరీక్షలు, గ్రేడ్లు, హోంవర్క్, అసైన్మెంట్లు, అకడమిక్ మరియు అచీవ్మెంట్ అంచనాలు అంటూ ఒక చక్రబంధంలో ఇరికించటం కారణంగా విద్యార్థులు తీవ్రమైన ఒత్తిడికి గురవుతున్నారు. ఒత్తిడి వల్ల డిప్రెషన్, యాంగ్జయిటీ, నెర్వస్నెస్ మరియు స్ట్రెస్-సంబంధిత సమస్యలు మీ పిల్లలు ఎదుర్కొంటున్నారు. ఒక్కోసారి ఒత్తిడి భరింత లేక తీవ్రమైన నిర్ణయాలు తీసుకుంటున్నారు. దీనికి ఏ ఒక్కరు బాధ్యత తీసుకోవటం లేదు. ఒక్కసారి మీ పిల్లల్ని గమనించండి, వారు ఎలాంటి స్థితిలో ఉన్నారో తెలుసుకోండి, వారికి సపోర్ట్గా నిలవండి.
శ్రీచైతన్య ర్యాంకుల కోసం...బలవుతున్న విద్యార్థులు
రన్నింగ్ రేస్ లాంటి పోటీప్రపంచంలో అరక్షణం ఏమరపాటుగా ఉన్నా రేసులో వెనక్కిపోయినట్టే. అలా విద్యార్థులు 6 వ తరగతి నుండి ఇంటర్ ద్వితీయ సంవత్సరం వరకు కష్టపడి, పోటీప్రపంచంతో పోటీపడి, లక్షలాది మందిని తమ ప్రతిభతో వెనక్కి నెట్టి ర్యాంకు సాధిస్తే వచ్చే సంతోషం కేవలం రెండు రోజులు మాత్రమే. కానీ ఆ ఫలితాలను సంవత్సరమంతా వాడుకునేది మాత్రం శ్రీచైతన్య. కష్టం విద్యార్థులది. ఫలితం మాత్రం శ్రీచైతన్యది. పోనీ ఈ ర్యాంకులు సాధించిన వారందరికీ ఫీజులు లేకుండా అయినా చదువుకునే అవకాశం ఇచ్చారా అంటే అదీ లేదు. లక్షలకు లక్షలు ఫీజు ముక్కుపిండి వసూలు చేసుకున్నారు. విద్యార్థులూ రేయింబవళ్ళు ఎంతో కష్టపడి టాప్ ర్యాంకులు సాధించినా లబ్ధి మాత్రం శ్రీచైతన్యకే కలుగుతుంది. మీ పిల్లల ర్యాంకులతో ఒకటి, ఒకటి, రెండు, రెండు, మూడు, మూడు అంటూ ప్రకటనలు గుప్పిస్తూ లక్షలాది అడ్మిషన్లు దండుకుంటోంది. కోట్లలో లాభాలను ఆర్జిస్తోంది. తల్లిదండ్రులారా మీరు మారండి, ర్యాంకు సాధించిన ప్రతీ తల్లిదండ్రులూ మీ పిల్లల ర్యాంకు వాడుకుంటున్నందుకు మీరు కోట్లలో డిమాండ్ చేయండి. అదీ మీ హక్కు. మీ పిల్లాడి కష్టార్జితం.
0 Comments