- ఫలితాలు ప్రకటించకుండా విద్యార్థులను మోసం చేస్తున్న ఫిడ్జి.
- 300 కోట్ల స్కాలర్షిప్ నీటిమూటలేనా.
- అంతలోనే ద్రోణాచార్య, ఐఐటి జీనియస్, ఫార్చున్ 40 అంటూ మరో ఎగ్జామ్.
ఫిడ్జి ఎంతో ప్రతిష్టాత్మకంగా డిసెంబర్ 24 నుండి జనవరి 7 వరకు ఫిడ్జి టాలెంట్ రివార్డ్ ఎగ్జామ్ (FTRE) నిర్వహించింది. 300 కోట్ల స్కాలర్షిప్ అంటూ భారీ ప్రకటనలో సోషల్ మీడియాను హోరెత్తిస్తోంది. కానీ స్కాలర్షిప్ సాధించిన విద్యార్థుల వివరాలను మాత్రం బహిరంగపరచలేదు. దీంతో పరీక్ష వ్రాసిన లక్షలాది మంది విద్యార్థులకు నిరాశే మిగిలింది. దేశవ్యాప్తంగా ఎంత మంది విద్యార్థులు పరీక్ష వ్రాశారు ? ఎంత మంది సెలక్ట్ అయ్యారు ? 300 కోట్ల స్కాలర్షిప్ ఎంత మంది విద్యార్థులకు అందించారు ? వారి వివరాలు మాత్రం ఎక్కడా కనిపించటం లేదు. దేశంలో ఎవరూ ఎప్పుడు, ఎక్కడ ఎలాంటి పరీక్ష నిర్వహించినా దాని ఫలితాలు ప్రకటించటం సాంప్రదాయం, నిజాయితీకి కొలమానం. కానీ స్కాలర్షిప్కి అర్హత సాధించిన వివరాలు ఎందుకు బహిరంగంగా ప్రకటించటం లేదు అనేది ప్రతి ఒక్కరి ప్రశ్న. అలా ప్రకటించని పక్షంలో ఫిడ్జి విశ్వసనీయత దెబ్బతింటుంది. అసలు ఒక్క ర్యాంకు వస్తేనే నానా హంగామా చేసే ఫిడ్జి, రూ. 300 కోట్ల స్కాలర్షిప్ అందిస్తుంటే ఇంకెంత ప్రచారం చేసుకుంటుంది. విద్యారంగాన్ని వ్యాపారంగా మలుచుకుని కోట్లు వెనకేసుకునే ఫిడ్జి లాంటి కార్పొరేట్ సంస్థ నిజంగా రూ. 300 కోట్లు స్కాలర్షిప్ ఇస్తుందా ? నమ్మిన వారందరూ పప్పులో కాలేసినట్టే. రూ. 300 కోట్ల స్కాలర్షిప్ అనేది ఉత్తమాట. దేశవ్యాప్తంగా ప్రతిభావంతులైన విద్యార్థులను వెతికి వెతికి పట్టుకోవటమే ఈ స్కాలర్షిప్ ఎగ్జామ్ యొక్క ముఖ్య ఉద్ధేశ్యం. స్కాలర్షిప్ పేరును వాడుకుని దేశవ్యాప్తంగా ఇతర విద్యాసంస్థల్లోని ప్రతిభావంతులైన విద్యార్థుల వివరాలు తెలుసుకునేందుకు విసిరిన వలే ఈ ఫిడ్జి టాలెంట్ రివార్డ్ ఎగ్జామ్. అలా తెలుసుకున్న డేటాను ఉపయోగించి ఇతర విద్యాసంస్థల్లో చదువుతున్న వారికి ఫిడ్జి హాస్టల్స్లో ఉచిత విద్యను ఆఫర్ చేయటం దగ్గర నుండి వేరే ఇతర ప్రోత్సాహకాలు ఆశచూపి తమ విద్యాసంస్థల్లో చేరేలా మభ్యపెట్టటమే ఈ స్కాలర్షిప్ వెనుక ఉన్న అసలు లక్ష్యం.
ద్రోణాచార్య, ఐఐటి జీనియస్, ఫార్చున్ 40..అంటూ మళ్ళీ ఎగ్జామ్స్ !
రూ. 300 కోట్ల స్కాలర్షిప్ సాధించిన విద్యార్థుల వివరాలు ప్రకటించకుండానే, జనవరి 28 మరియు ఫిబ్రవరి 4 వ తేదీలలో మరోసారి ఎగ్జామ్స్ అంటూ మరోసారి స్కాలర్షిప్ను ప్రకటించింది ఫిడ్జి. ఐఐటిలో ఉచితంగా చదువుకోవడానికి సిద్దంగా ఉండండి, మీ టాలెంట్ చూపండి, జీవితకాల అవకాశాన్ని పొందండి అంటూ మరో ఆకర్షణీయ మంత్రాన్ని విద్యార్థులకు ఎరగా వేస్తోంది. మరోసారి ఫిడ్జి వలకు చిక్కారా ? మీ డబ్బు వృధా, సమయం వృధా. పైగా బుర్ర మీద అనవసరమైన ఒత్తిడి.
బుర్ర ఫ్రై చేస్తున్న స్కాలర్షిప్ ఎగ్జామ్స్ !
ఇప్పటికే మంత్లీ ఎగ్జామ్స్, క్వాటర్లీ ఎగ్జామ్స్, ఆఫ్ఇయర్లీ ఎగ్జామ్స్, ప్రాక్టీస్ ఎగ్జామ్స్, ఫైనల్ ఎగ్జామ్స్ ఇలా విద్యార్థికీ ప్రతి రోజూ ఒక పరీక్షే. మళ్ళీ అదనంగా ఒలింపియాడ్స్, ఇవీ చావలవట్టు స్కాలర్షిప్ ఎగ్జామ్స్. చిన్నారి మెదడుపై ఎంత తీవ్రమైన ఒత్తిడి పెంచుతోంది కార్పొరేట్ విద్యాప్రపంచం. పోటీప్రపంచం పేరు చెబుతూ రాబోయే తరాలపై భారీగా ఒత్తిడి పెంచుతూ మోయలేని భారాన్ని మోపి విద్యార్థులను తీవ్ర నిర్ణయాలు తీసుకునేలా ప్రేరేపిస్తున్నాయి కార్పొరేట్ విద్యాసంస్థలు. ఇవి సరిపోవన్నట్లు కార్పొరేట్ సంస్థలు ఏ పరీక్షలు చెబితే అవి గుడ్డిగా నమ్మి ఎగ్జామ్స్ పేరుతో తల్లిదండ్రులే తమ పిల్లలను తీవ్రఒత్తిడికి గురి చేస్తూ, మరో వైపు సొమ్మును కోల్పోతున్నారు. ఇప్పటికైనా మేల్కోకుంటే రాబోయే తరాలు ఒత్తిడితో పాటు మానసిక అనారోగ్యంతో బాధపడే ప్రమాదం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. విద్యార్థులపై అంత ప్రేమ, వారి భవిష్యత్తుకు బంగారు బాటలు వేస్తున్నామని చెప్పే కార్పొరేట్ సంస్థలు తమ విద్యార్థులకు ఉచితంగా ఒలింపియాడ్స్ తమ స్కూల్స్లోనే నిర్వహించవచ్చు కదా అనే అభిప్రాయం తల్లిదండ్రుల నుండి వ్యక్తం అవుతోంది.
0 Comments