- ఒలింపియాడ్స్ పేరిట INTSO EDUCATION, KAT పేరుతో ఫేక్ సంస్థలను నెలకొల్పిన శ్రీచైతన్య.
- ఒక్క 2022-23లోనే 4 లక్షల మంది విద్యార్థుల దగ్గర నుండి రూ. 30 కోట్ల లూటీ.
- ఇప్పటి వరకు 32 లక్షల మంది విద్యార్థుల దగ్గర రూ. 240 కోట్ల దోపిడీ.
- KAT ఎడ్యుకేషన్ పేరుతో మరో రూ. 18 కోట్లు దోపిడీ.
- KAT EDUCATION పేరుతో రూ. 200 కోట్లు ఆరగించిన శ్రీచైతన్య
- తల్లిదండ్రుల అమాయకత్వాన్ని ఆసరా చేసుకుని దండుకుంటున్న శ్రీచైతన్య
- ప్రభుత్వాలు చర్యలు తీసుకోవు,
- కనీసం హైకోర్టులైన సుమోటాగా కేసులు నమోదు చేయలేవా ?
- శ్రీచైతన్య విద్యాసంస్థల మొత్తాన్ని బ్యాన్ చేయాలని డిమాండ్.
కార్పొరేట్ స్కూల్స్ దోపిడీకి అడ్డూ అదుపు లేకుండా పోతోంది. ప్రభుత్వాలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండటంతో కార్పొరేట్ స్కూల్స్ ఆడిందే ఆటగా మారింది. ఆయా కార్పొరేట్ సూల్స్ నిబంధనలను తూట్లు పొడుస్తూ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాయి. ఇప్పటికే స్కూల్ ఫీజులు, డొనేషన్లు, పుస్తకాలు, డ్రస్లు ఇవీకాక ఐఐటి/ నీట్ ఫౌండేషన్స్ పేరుతో వేలు, లక్షల రూపాయలు ఫీజుల రూపంలో దోపిడీ చేస్తుంది. ఇది చాలదన్నట్టు కొత్త రకం దందాకు తెరతీసింది శ్రీచైతన్య. ఒలింపియాడ్స్ పేరును వాడుకుంటూ శ్రీచైతన్యయే INTSO EDUCATION పేరుతో ఓ బినామీ సంస్థను నెలకొల్పి ఒలింపియాడ్స్ నిర్వహిస్తోంది. దేశవ్యాప్తంగా ఎంతో పేరుప్రఖ్యాతులు ఉన్న ఒలింపియాడ్ ఎగ్జామ్స్కు ఉన్న క్రేజ్ను క్యాష్ చేసుకునేందుకు మ్యాథ్స్ టాలెంట్ సెర్చ్ ఒలింపియాడ్ (MTSO), ఆప్టిట్యూడ్ టాలెంట్ సెర్చ్ ఒలింపియాడ్ ( ATSO), ఇంగ్లీష్ టాలెంట్ సెర్చ్ ఒలింపియాడ్ (ETSO), సైన్స్ టాలెంట్ సెర్చ్ ఒలింపియాడ్ (STSO) , జి.కె. టాలెంట్ సెర్చ్ ఒలింపియాడ్ (GTSO) పేరుతో అచ్చంగా ఒలింపియాడ్స్ను పోలిన విధంగా పేర్లు పెట్టి మొత్తం 5 రకాల ఒలింపియాడ్స్ను నిర్వహిస్తోంది శ్రీచైతన్య. ఈ ఒలింపియాడ్ పరీక్షల కోసం అన్నీ శ్రీచైతన్య స్కూల్స్లో ఉన్న విద్యార్థులందరిపై అదనపు భారం మోపుతోంది. 5 రకాల ఒలింపియాడ్స్ కోసం ఒక్కో పరీక్షకు రూ. 150/- చొప్పున 5 పరీక్షలకు గాను రూ. 750/- వసూలు చేస్తోంది శ్రీచైతన్య. 2022-23 విద్యాసంవత్సరానికి 4 లక్షల మంది విద్యార్థుల దగ్గర నుండి రూ. 750/- చొప్పున రూ. 30 కోట్లు వసూలు చేసింది. గత 10 సంవత్సరాలుగా ఈ దోపిడీని నిరంతరాయంగా కొనసాగిస్తోంది. విచిత్రం ఏమిటంటే దేశవ్యాప్తంగా శ్రీచైతన్య స్కూల్స్లో చదివే విద్యార్థులు, శ్రీచైతన్య మేనేజ్మెంట్ అనుబంధంగా నడిచే ప్రైవేట్ స్కూల్స్లో చదివే విద్యార్థులు మాత్రమే ఈ పరీక్షల్లో పాల్గొంటారు. వేరే ప్రైవేట్ స్కూల్ విద్యార్థులు ఇందులో పాల్గొనక పోవటం గమనార్హం. కొన్ని గవర్నమెంట్ స్కూల్స్, మరికొన్ని చిన్న చిన్న ప్రైవేట్ స్కూల్స్ నిర్వాహకులకు డబ్బు ఆశ చూపి పెద్దఎత్తున రిజిస్ట్రేషన్ చేసుకునేలా ఒప్పందాలు చేసుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి.
శ్రీచైతన్యకు కాదేది దోపిడీ అనర్హం !
శ్రీచైతన్య స్కూల్స్లో 680869 మంది విద్యార్థులు చదువుతున్నారు. ఇంత మంది నుండి ఫీజులతో పాటు మరింత దండుకోవాలనే ఆలోచనతో ఫేక్ ఒలింపియాడ్స్కు శ్రీకారం చుట్టింది శ్రీచైతన్య. శ్రీచైతన్య సంస్థల్లో పని చేసే కొందరు వ్యక్తులతో ఐఎన్టీఎస్ఓ ఎడ్యుకేషన్ (INTSO EDUCATION) అనే పేరులో ఓ బినామీ సంస్థను 2011 నుండి విజయవాడ కేంద్రంగా నెలకొల్పింది. దానికి యం.ఎస్.వి. రాధాకృష్ణ (MSV RADHAKRISHNA) నిర్వాహకులుగా వ్యవహరిస్తున్నారు. అలాగే ఎన్టీఎస్ఓ ఎడ్యుకేషన్ (INTSO EDUCATION) రీజనల్ మేనేజర్ తోట మహాలక్ష్మీ, జనరల్ మేనేజర్ టి. సంగీత విధులు నిర్వహిస్తున్నారు. శ్రీచైతన్య తరపున ఎగ్జామ్స్ నిర్వహిస్తోన్న సంస్థ ప్రతినిధి అయిన కొప్పారపు సుధీర్ (డైరెక్టర్స్ పి.ఏ)ను వివరణ అడుగగా, ఐఎన్టీఎస్ఓ ఎడ్యుకేషన్కి, క్యాట్ ఎడ్యుకేషన్కి శ్రీచైతన్యకు ఎలాంటి సంబంధం లేదని అకడమిక్ హెడ్ బి.వి. సతీష్ సూచనలకు అనుగుణంగా తన మెయిల్ నుండి పరీక్షలు నిర్వహించమని ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు. అలాగే బి.వి. సతీష్ని వివరణ అడుగగా ఐఎన్టీఎస్ఓ ఎడ్యుకేషన్ సంస్థ అనేది ఒక స్వతంత్ర సంస్థ అని ప్రకటిస్తున్నారు. కానీ శ్రీచైతన్య విద్యాసంస్థతో సంబంధం లేని ఒక ప్రైవేట్ వ్యక్తి నిర్వహించే ఒలింపియాడ్స్ను ఎందుకు నిర్వహిస్తున్నారు అంటే మాత్రం సమాధానం చెప్పలేకపోతున్నారు. ఈ ఒలింపియాడ్స్ అదనపు భారం అని తెలిసినా మీ స్కూల్స్లో ఎందుకు ప్రోత్సహిస్తున్నారు అంటే సమాధానం దాట వేస్తున్నారు. ఒక ప్రైవేట్ వ్యక్తి ఒలింపియాడ్స్ పేరు మీద ఓ సంస్థను స్థాపించి శ్రీచైతన్య వద్దకు వచ్చి పరీక్షలు నిర్వహిస్తారా అంటే మౌనమే సమాధానం అయ్యింది. ఈ పరీక్షలకు సంబంధించి ఫీజును మాత్రం శ్రీచైతన్య స్కూల్స్ ట్రస్ట్ అయిన నెక్ట్స్జన్ ద్వారా వసూలు చేస్తున్నారు. నెక్ట్స్జన్ నుండి ఐఎన్టీఎస్ఓ ఎడ్యుకేషన్కి చెల్లిస్తున్నట్లు చెప్తున్నారు. కానీ అకౌంట్స్ వివరాలు అందించేందుకు నిరాకరించటం పలు అనుమానాలకు తావిస్తోంది. ఎన్ని చెప్పినా ఐఎన్టీఎస్ఓ ఎడ్యుకేషన్తో పాటు నాలెడ్జ్ అసెస్మెంట్ టెస్ట్ (క్యాట్) ఈ రెండు సంస్థలు శ్రీచైతన్య యాజమాన్యం ఆధ్వర్యంలోని బినామీ వ్యక్తులే నిర్వహిస్తున్నారు అనేది కచ్చితమైన సమాచారం. మరో గమనించదగ్గ విషయం ఏమిటంటే ఐఎన్టీఎస్ఓ ఎడ్యుకేషన్ వెబ్సైట్లో సంస్థ నిర్వాహకుల వివరాలు, మిగతా సభ్యుల వివరాలు లేవు. అడ్రస్ కూడా ఫేక్, అలాగే క్యాట్ ఎడ్యుకేషన్ పేరుతో నిర్వహించే వెబ్సైట్లోనూ నిర్వహకుల వివరాలు, మిగతా సభ్యుల వివరాలు పొందుపరచలేదు. అడ్రస్, ఫోన్ నెంబర్ కూడా ఫేక్ అని విచారణలో తేలింది. అలాంటి వారిని ఎందుకు ప్రోత్సహిస్తున్నారు అని శ్రీచైతన్య ప్రతినిధి బి.వి. సతీష్ ని వివరణ కోరితే సంబంధం లేని ఉదాహరణలు చెపుతూ తప్పించుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ రెండు పరీక్షకు సంబంధించిన అప్లికేషన్లు, ఎగ్జామ్ పేపర్లు అన్నీ శ్రీచైతన్య ఆధ్వర్యంలోనే తయారవుతున్నాయి. పరీక్షలు నిర్వహించేది శ్రీచైతన్య విద్యాసంస్థల్లోనే. విచిత్రం ఏమిటంటే ఈ ఒలింపియాడ్స్ అన్నీ ఫేక్ అనే విషయం నిర్వహిస్తున్న స్కూల్స్ ప్రిన్సిపాల్స్కి తెలియకపోవటం ఆశ్చర్యకరం. అంటే ఎంత పకడ్బందీగా ఎవరికీ ఎలాంటి వివరాలు తెలియకుండా అంత గుట్టుగా వ్యవహారం సాగిస్తున్నారు. నిజం నిప్పులాంటింది, ఎప్పటికైనా దహించి వేయక మానదు. అలాగే ఇప్పుడు బయటపడిరది. అసలు ఐఎన్టీఎస్ఓ ఎడ్యుకేషన్, క్యాట్ వంటి ప్రైవేట్ సంస్థలు నిర్వహించే ఒలింపియాడ్ ఎగ్జామ్స్కు ప్రభుత్వం నుండి ఎలాంటి గుర్తింపు లేదు. కార్పొరేట్ సంస్థలు నిర్వహించే ఇటువంటి పరీక్షలను పూర్తిగా నిషేధం విధించాల్సి ఉంది. ఇలాంటి పరీక్షల వలన ఎలాంటి ప్రయోజనం ఉండకపోగా, పిల్లలపై అనవసర ఒత్తిడి పెంచుతున్నామనే విషయాన్ని తల్లిదండ్రులు గ్రహించాలి. ఇలాంటి ఫేక్ ఒలింపియాడ్స్ పట్ల జాగ్రత్త వహిస్తూ, మోసాల పట్ల జాగరూకతతో వ్యహరించాల్సిందిగా తల్లిదండ్రులను కోరుతోంది సమాజ్టుడే. గత దశాబ్దకాలంగా దాదాపు 3.2 మిలియన్ల విద్యార్థులతో పరీక్షలు వ్రాయించి సుమారు రూ. 240 కోట్ల సొమ్ము లూటీ చేసింది. క్యాట్ ఎడ్యుకేషన్ ద్వారా మరో 200 కోట్లు కొల్లగొట్టింది. ఈ సొమ్ము అంతా ఎవరి జేబులోకి వెళుతోంది అని చిదంబర రహస్యం. ఆయా పోటీల్లో పాల్గొన్న విద్యార్థులకు 150 ల్యాప్టాప్లు, మెడల్స్, కన్సోలేషన్ బహుమతులు, మెరిట్ సర్టిఫికేట్లు ప్రదానం చేసి మిగిలిన కోట్లాది రూపాయలు దండుకుంటోంది. దీనిపై కేంద్ర దర్యాప్తు సంస్థల్కెన సి.బి.ఐ, ఈడీలతో దర్యాప్తు చేయించవలసిన అవసరం ఎంతైనా ఉంది.
KAT OLYMPIAD పేరుతో దోపిడీ
ఐఐటి/ నీట్ ఫౌండేషన్స్ అంతా బూటకం !
లేని ఓ పోటీ ప్రపంచాన్ని సృష్టించి, తల్లిదండ్రుల మనస్సులో భయంతో కూడిన విషాన్ని నింపి, విద్యార్థులను పోటీప్రపంచం అనే పంజరంలో బంధించి దాని నుండి డబ్బు దండుకోవటం కార్పొరేట్ స్కూల్స్ సృష్టించిన నయా ఆదాయ మార్గం. ప్రతిభావంతులను ప్రోత్సహించేందుకు స్కాలర్షిప్ల కోసం నిర్వహించే పరీక్షలను అడ్డంగా పెట్టుకుని స్కూల్ స్థాయిలోనే ఒలింపియాడ్స్ పేరుతో ఎవరికి వారే బినామీ సంస్థలు ఏర్పాటు చేసి విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటున్నారు. పిల్లల జీవితాలను కార్పొరేట్ బందీలుగా మార్చుకున్నారు. 6 వ తరగతి నుండే ఐఐటి / నీట్ ఫౌండేషన్ క్లాసులు నిర్వహిస్తాం దీంతో మీ వాడిని ఐఐటి ర్యాంకర్ని చేస్తాం, డాక్టర్ సీటు తెప్పిస్తాం అని అకర్షణీయమైన ప్రకటనలతో తల్లిదండ్రల్ని మభ్యపెట్టడంతో అసలు కథ మొదలవుతుంది. ఆ ప్రకటన వలలో చిక్కిన కష్టమర్స్ (తల్లిదండ్రులు)ని ట్యూషన్ ఫీజు, డొనేషన్, బిల్డింగ్ ఫండ్ అంటూ నిలువునా దోచేస్తున్నారు. 8, 9, 10 వ తరగతిలోని సబ్జెక్టుల్లోని అంశాలనే 6, 7 వ తరగతుల్లో బోధించటమే ఐఐటి/ నీట్ ఫౌండేషన్. పాపం చిన్న పిల్లల అవగాహన సామర్థ్యం ఎంత అని కూడా ఆలోచించకుండా ఫౌండేషన్ పేరుతో చిన్న బ్రెయిన్స్పై అనవసరపు ఒత్తిడిని పెంచుతున్నారు. ఇది వారి మానసిక ఎదుగుదలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఈ కార్పొరేట్ స్కూల్స్లో విద్యార్థులను ప్రతిభవంతుల్కెన విద్యార్థులను ఓ గ్రూపుగా మిగతా వారని మార్కులను బట్టి వేరే వేరే గ్రూపులుగా విభజించి క్లాసుల నిర్వహణ జరుగుతుంది. టెక్నో కరిక్యులమ్, సి`బ్యాబ్, ఆ బ్యాబ్ అంటూ ఆకర్షణీయమైన పేర్లు పెట్టి ఐఐటి / నీట్ టాప్ ర్యాంకు ఆశ చూపి అదనంగా డబ్బులు గుంజుతున్నారు. మేము చెప్పే ఐఐటి / నీట్ ఫౌండేషన్లో శిక్షణ తీసుకోవటం ద్వారానే ఒలింపియాడ్స్లో విజయాలు సాధిస్తున్నారు అని చూపించడానికే ఐఎన్టిఎస్ఓ ఒలింపియాడ్స్ జిమ్మిక్కు అని తల్లిదండ్రులు తెలుసుకోవాల్సిన అసలు విషయం.
బాల్యం చెర...
ఆహ్లాదంగా గడపాల్సిన బాల్యాన్ని కార్పొరేట్ సంస్థల పంజరాల్లో బందీని చేశాయి నేటి విద్యావిధానాలు. పోటీప్రపంచం అనే బూచిని చూపి తరగతి గోడల మధ్య జీవిత ఖైదీగా మార్చాయి. జైలు లాంటి తరగతి గదుల్లో బాల్యాన్ని బిక్కుబిక్కుమంటూ వెళ్ళదీస్తున్న మనసుల్ని పరికించి చూసే తీరిక ఎవరికీ లేదు. పుస్తకాల్లో ఉన్న జ్ఞానం తప్పించి, బాహ్య ప్రపంచంలో తర్కంతో ఎలా మసులుకోవాలో తెలియని విద్యార్థులు కోకొల్లలు. రోజులో 10 నుండి 14 గంటలు చదువు పేరుతో విద్యార్థులపై తీవ్రమైన ఒత్తిడికి గురిచేస్తూ మానసిక వేదనకు గురిచేస్తున్నాయి కార్పొరేట్ విద్యాసంస్థలు. మానసిక పరిణతి లేక విద్యార్థులు వివిధ రుగ్మతలతో బాధపడుతున్నారు. మానసిక ఉల్లాసాన్ని పెంపొందించే ఆటలు లేవు, పాటలు లేవు. అందమైన బాల్యానికి జ్ఞాపకాలు అంతకంటే లేవు. కార్పొరేట్ స్కూల్స్కి జీవితకాలపు కష్టమర్స్లా బ్రతుకు ఇంకెంత కాలమో కాలమే నిర్ణయించాలి.
0 Comments